Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘సాగునీటి రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెడతాం. 48 గంటలపాటు చర్చకు రమ్మని కేసీఆర్కు సవాల్ విసురుతున్నా. కేటీఆర్, హరీశ్రావు కూడా చర్చలో పాల్గొనవచ్చు. కవిత కూడా పాల్గొంటానంటే ఉభయసభల సమావేశం ఏర్పాటు చేస్తం. మాట్లాడేందుకు పూర్తి అవకాశమిస్తం. ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం’..
ఇవీ ఇటీవల మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రగల్భాలు. కానీ ఆచరణలో అందుకు పూర్తివిరుద్ధంగా వ్యవహరించారు. సోమవారం అసెంబ్లీలో ఒక్క హరీశ్రావు మాట్లాడుతుంటేనే 50 నిమిషాల వ్యవధిలో 21 సార్లు మైక్ కట్ చేశారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత అంశంపై అసెంబ్లీలో సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రజెంటేషన్ అనంతరం బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి హరీశ్రావు చర్చలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సభలో వెల్లడించిన ప్రతి అంశాన్ని తూర్పారబట్టారు. ఆధారాలతోసహా కాంగ్రెస్ వాదన అబద్ధమని నిరూపించారు. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ మంత్రులు, నేతలు హరీశ్రావుపై ముప్పేటదాడికి దిగారు.
ఒకరి తర్వాత ఒకరు లేస్తూ హరీశ్రావును అడ్డుకొనేందుకు తీవ్రంగా యత్నించారు. అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. హరీశ్రావు మాట్లాడుతుండగానే మంత్రి ఉత్తమ్కుమార్ పదే పదే లేస్తూ అడ్డుతగిలారు. అనంతరం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పదే పదే లేస్తూ చర్చకు ఆటంకం కలిగించారు. మంత్రులే కాదు ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, ఆది శ్రీనివాస్ తదితరులు సైతం తమ స్థానాల నుంచి లేచి హరీశ్రావు ప్రసంగానికి అడ్డుతగిలే యత్నం చేశారు. కాంగ్రెస్ మంత్రులు లేవడం.. హరీశ్రావు మైక్ను స్పీకర్ కట్ చేయడం సభలో చర్చ సందర్భంగా పరిపాటిగా మారిపోయింది.