Rythu Bharosa | రైతు భరోసా విషయంలో చేసేది గోరంత.. చెప్పుకునేది కొండంత అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులందరికీ ఎకరాకు రూ.7,500 రైతు భరోసా అని చెప్పి.. ఎందుకు రూ.6వేలకు కుదించారని నిలదీశారు. ఇప్పుడు ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా విదిల్చి ఇచ్చిన మాట మీద నిలబడ్డట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 68లక్షల మంది రైతులుంటే.. 21,45,330 మందికి రైతు భరోసా వేసినట్లు చెప్పుకుంటున్నారని.. మరి మిగతా 47లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి? అంటూ ప్రశ్నించారు. 2023 వానాకాలానికి సంబంధించి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం లోపు ఉన్న రైతు సంఖ్య 22,55,181గా గుర్తించి, రైతుబంధు అందిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 21,45,330 మందిగా గుర్తించిందన్నారు. ఈ లెక్కన 1,09,851 మంది రైతులకు కోత విధించిందని ఆరోపించారు.
లక్షపైగా రైతులకు ఎందుకు రైతు భరోసా లేకుండా చేసారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల సమాధానం చెప్పాలన్నారు. మీరు చెబుతున్న నిర్ణీత కాల వ్యవధి అంటే ఎప్పుడో కూడా చెప్పాల్సిందేనన్నారు. ఇప్పుడు తీసుకుంటే రూ.10వేలు.. డిసెంబర్ 9, 2023 నాడు తీసుకుంటే రైతు భరోసా రూ.15వేలు అన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టి, రైతన్నకు భరోసా లేకుండా చేశారని ఆరోపించారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తమన్నారని.. మాట మార్చి 26, జనవరికి అని చెప్పారని.. అది కూడా కాదని మార్చి 31 వరకు ఇస్తామని ప్రకటించారన్నారు. నాట్లు వేసే కంటే ముందే కేసీఆర్ పంట పెట్టుబడి సాయంగా రైతు బంధు అందిస్తే.. కాంగ్రెస్ పాలనలో కోతల కాలం వచ్చినా రైతు భరోసా వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ప్రభుత్వానికి లబ్ధిదారుల్లో కోతలు విధించడంపై ఉన్న దృష్టి, రైతులు, పేదల సంక్షేమం పట్ల ఏమాత్రం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాపం రైతన్నలకు శాపంగా మారిందన్నారు.
14నెలల పాలనలో 415పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. రైతు భరోసా రాలేదని ఒకరు.. అప్పు కట్టలేదని ఇంకొకరు.. బ్యాంకుల వేధింపులు భరించలేక మరొకరు.. ఇలా రాష్ట్రంలో రైతన్నల చావులు నిత్యకృత్యం అవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ధ్వజమెత్తారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ, రైతు భరోసా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నదని మండిపడ్డారు. 2023 యాసంగిలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా రూ.2,500.. 2024 వానాకాలంలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా రూ.7,500 ఈ యాసంగికి ఒక్కో ఎకరానికి ఇవ్వాల్సిన రూ.7,500 కలుపుకొని మొత్తం ఒక్కో రైతుకు ఎకరానికి రూ.17,500 చొప్పున బాకీ పడింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఈ బాకీని ఇంకెప్పుడు తీర్చుతారన్నారు. ఆవేదనలో ఉన్న రైతన్నకు ఓదార్పునిస్తారని ప్రశ్నించారు. లబ్ధిదారుల జాబితాలో కోత విధించిన లక్ష మంది రైతులతో పాటు మిగతా రైతులందరికీ వెంటనే రైతు భరోసా సాయం అందించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.