హైదరాబాద్ : ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ ( Future City ) సరికాదని,దానిని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్రావు ( Harish Rao ) చేసిన నిర్మాణాత్మక ప్రకటన సరైనదేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ( MLC Deshapathi Srinivas ) అన్నారు.ఈ ప్రకటన తెలంగాణ ప్రజలు హర్షించే , ప్రయోజనాలు కాపాడే ప్రకటన అని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ఉన్న ఫార్మా కంపెనీలను దూరంగా నెలకొల్పి , ప్రజల ఆరోగ్యాలను కాలుష్యం బారిన నుంచి కాపాడాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ ఫార్మాసిటీకి ప్రణాళికలు తయారు చేసిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం భూమి కోసం రైతులను , ఫార్మా పరిశ్రమల కోసం పారిశ్రామిక వేత్తలను ఒప్పించారని వివరించారు.
నేడు రేవంత్ తమ స్వార్థం కోసం , మంది మాగాధుల కోసం రియల్ వ్యాపారానికి తెర లేపి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మాసిటీని గందరగోళం చేస్తున్నాడని విమర్శించారు. ఫార్మాసిటీ అసలు ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నాడని మండిపడ్డారు. కోర్టులో ఫార్మా సిటీ కడుతు న్నామని చెబుతూనే బయట ఫ్యూచర్ సిటీ అని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫార్మా సిటీని రద్దు చేసి భూములను రైతులకు తిరిగి ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఏ లక్ష్యం కోసం భూములు తీసుకున్నారో, ఆ లక్ష్యం లేకపోతే చట్టం ప్రకారం ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఇవ్వకుండా, ఆ భూములను మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఎలా మళ్లిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు ధాన్యం కుప్పల్లోనే కుప్ప కూలుతున్నా రని పేర్కొన్నారు. హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చడం, ధరణిని రద్దు చేయడం, ఇతర వినాశకరమైన విధానాలకు కాంగ్రెస్ పాల్పడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఏ వర్గం సంతృప్తి కరంగా లేరని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు.