హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను వీడినవారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హామీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ సర్కార్ తనకు ఇష్టమైన టీవీ చానళ్లు, పత్రికలకు లీకులు ఇస్తున్నదని ఆరోపించారు. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే 2001 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఫోన్ట్యాపింగ్పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై లై డిటెక్ట్ పరీక్షకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారని గుర్తుచేశారు.
బుధవారం ఓ చానల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలో.. పున్నమికి పుట్టి అమావాస్యకు అంతం అవుతుందని అన్నారని, వాళ్లే రాజకీయంగా కనిపించకుండాపోయారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఉనికే ఉండదని, ఆ పార్టీనే లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికేవారికి అదే గతి పడుతుందని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, కడియం కావ్య, అరూరి రమేశ్, రంజిత్రెడ్డి, బీబీ పాటిల్ వంటివాళ్లు ఓడిపోబోతున్నారని తెలిపారు.
ప్రజాపాలన ఎటుపాయె?
ప్రజాపాలన ఎక్కడికిపోయిందని హరీశ్రావు ప్రశ్నించారు. ప్రజల నుంచి ఒక్క రోజు దరఖాస్తులు తీసుకోగానే రేవంత్రెడ్డికి ముక్కులకొచ్చిందా? అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులెన్ని? పరిష్కారమైన సమస్యలెన్ని? అని ప్రశ్నించారు. సాగునీరు లేక రైతులు అరిగోసపడుతుంటే, గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురై చనిపోతుంటే సీఎం, మంత్రులకు కనీసం పరామర్శించేందుకు వీలు కావటం లేదా? దీనికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందా? అని నిప్పులు చెరిగారు.
నిజంగా ఎన్నికల కోడ్ ఎదురైతే ఆగస్టు 15వ తేదీ నుంచి రూ.2 లక్షల రుణమాఫీ అని ఎందుకు ప్రకటించారు? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న భయంతోనే ప్రకటన చేశారని పేర్కొన్నారు. సుపారీ సంస్కృతి కాంగ్రెస్దే తప్ప తమది కాదని స్పష్టంచేశారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు దక్కకుండా బీజేపీకి లాభం చేయాలని చూసింది ఎవరో.. ఇప్పటికీ ఖమ్మం, కరీంనగర్లో అభ్యర్థులను ప్రకటించకుండా ఎవరి ప్రయోజనం పనిచేస్తున్నారో అందరికీ తెలుసు అని అన్నారు. బీఆర్ఎస్ ఫైటర్ అని, తాము ఎప్పటికీ తెలంగాణ ప్రజల టీమ్ అని పేర్కొన్నారు.