Harish Rao | ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిందని.. 700 రోజులు దాటినా వాటిని అమలు చేయడం లేదని.. అందుకే అందుకే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సురుకు తగలాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక అని..యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనువిప్పు కలుగుతుందని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్నారు. లేకుంటే ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టినా, హామీలు అమలు చేయకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటు వేశారని రేవంత్ అంటాడని చెప్పారు. ఉద్యోగాలు రావాలన్నా.. పింఛన్లు రావాలన్నా, పథకాలు అమలు కావాలన్నా, హైడ్రా ఆగాలన్నా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, మాగంటి సునీతా గెలవాలన్నారు.
రెండేళ్లలో రేవంతు రెడ్డి రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేసిండని.. కేసీఆర్ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దితే, అత్యంత అవినీతి రాష్ట్రంగా తయారు చేసిండని మండిపడ్డారు. బిల్డింగ్ పర్మిషన్కు స్క్వేర్ ఫీట్కు రూ.75, ఫైనాన్స్ బిల్లు క్లియర్ కావాలంటే 12శాతం కమిషన్ ఇవ్వాలట అంటూ ఆరోపించారు. ఇళ్లు జాగ, భూముల సమస్యలు పరిష్కారం కావాలంటే 40 శాతం భూములు రాసివ్వాలట.. మొత్తం పర్సెంటేజీలు డిసైడ్ చేసిండని ధ్వజమెత్తారు. ఒకప్పుడు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామమని.. తెలంగాణ ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం ఆ పథకం ప్రారంభించేదని.. తెలంగాణ అనుసరిస్తే, దేశం ఆచరించేదన్నారు. ఒక రాష్ట్రం ఎట్ల ఉండాలో కేసీఆర్ తయారు చేస్తే, రాష్ట్రం, సీఎం ఎట్ల ఉండగూడదో రేవంతు తయారు చేసిండని విమర్శించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని.. గాంధీ టోపీలు పెట్టి ప్రజలను మోసం చేశారని.. కేసీఆర్ 350 బస్తీ దవాఖానలు ప్రారంభించారని.. ఉచితంగా పరీక్షలు చేసే విధంగా డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ప్రారంభిస్తే రేవంత్ ప్రభుత్వం బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిందని.. ఆరు నెలలుగా బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది జీతాలు చెల్లించడం లేదు, మందులు లేవన్నారు. వాళ్లకు జీతాలు ఇవ్వకుండా మీకు వైద్య సేవలు అందకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. బస్తీ దవాఖానలు చూస్తే కేసీఆర్ గుర్తుకు వస్తారు, కాబట్టి బస్తీ దవాఖానల ఉనికి లేకుండా చేస్తున్నడని.. నీళ్ల బిల్లులు అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నపుడు 20వేల లీటర్ల వరకు బిల్లులు లేవని.. రేవంతు వచ్చిండు బిల్లులు వసూలు చేస్తున్నారన్నారు.
జూబ్లీహిల్స్లో గెలుపు మాగంటి సునీతమ్మ గెలుపు మాత్రమే కాదని.. తెలంగాణ ప్రజల గెలుపు అని తెలిపారు. హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాని అక్కా చెల్లెల్ల గెలుపు, పింఛన్లు రాని అవ్వాతాతల గెలుపు, నిరుద్యోగుల గెలుపు అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఓడినా ఆయన ముఖ్యమంత్రి పదవి పోదు, ప్రభుత్వం పోదని.. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలె అన్నారు. హైడ్రా పెట్టి పెద్దోళ్ల ఇండ్లు కూల్చుతలేడు గానీ, పేదోళ్ల ఇండ్లు కూల్చుతున్నడని.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి చీఫ్ విప్, గాంధీల ఇండ్లు, భూములు హైడ్రాకు ఎందుకు కనబడటం లేదని.. గరీబోళ్ల ఇండ్లే హైడ్రాకు కనబడుతున్నాయా? అంటూ నిలదీశారు. ‘హైడ్రా కతం హోనాహే.. కాంగ్రెస్ కో హరానేహే.. హైడ్రా బంద్ హోనాతో .. మాగంటి సునితమ్మకో జితానాహే’ అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్ల ముందుకు బుల్డోజర్ వస్తది.. అది రావొద్దు అంటే సునితమ్మను గెలిపించాలని పిలుపునిచ్చారు. ముస్లింలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి ఇవ్వలేదన్నారు. కేసీఆర్ డిప్యూటీ సీఎం, హోం మినిస్టర్ ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరే మొదట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారన్నారు.
షాదీ ముబారక్ కింద తులం బంగారం అన్నాడని.. తులం జాడ లేదు గానీ కల్యాణ లక్ష్మి చెక్కు ఏడాది దాటినా ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ కిట్ బందు, బతుకమ్మ చీర బందు, రంజాన్ తోఫా బంద్, ఓవర్సిస్ స్కాలర్ షిప్ బందు, దళిత బందు బందు, బీసీ బందు బందు, బస్తీ దవాఖాన ఖతం పట్టించారని ఆరోపించారు. హిందు, ముస్లీం అందరం కలిసి హైద్రాబాద్ను, తెలంగాణను కాపాడుకోవాలన్నారు. ఇది మాగంటి సునితమ్మ గెలుపు కాదని.. బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపు, తెలంగాణ గెలుపుగా అందరం కలిసి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ కార్యకర్తలు బాగా కలిసి పనిచేస్తున్నారని.. కేటీఆర్, తాను జూబ్లిహిల్స్ను ఆనుకొని ఉన్నామన్నారు. పిలుస్తే పది నిమిషాల్లో మీకు అండగా వస్తామని.. ఎవరూ భయపడవద్దు.. మీ ముందు నిమిషాల్లో ఉంటామన్నారు. సునితమ్మకు కుడి, ఎడమ చెయ్యిగా ఉంటామని చెప్పారు. కార్యకర్తలకు ఆపద వస్తే, మెసేజ్ చేస్తే చాలు నేను, తలసాని, కేటీఆర్ ముందుంటామని స్పష్టం చేశారు. ఉద్యమాలు, పోరాటాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్తకాదని.. భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ జూబ్లీహిల్స్ గెలిపించి బహుమతిగా ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ను దించి.. మనం కూడా కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి సునితమ్మకు తమ్ముడిగా ఎంతో కృషి చేస్తున్నారని.. ఎక్కడ చూసినా కేసీఆర్ కు ఓటు వేస్తాం అని అంటున్నారని.. పెద్ద మెజారిటీతో సునీతమ్మను గెలిపించాలని హరీశ్రావు కోరారు.