Harish Rao : తెలంగాణలో రెండేళ్లు దాటినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏది? ఇది రాజ్యాంగ శూన్యత కాదా?రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెబుతూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ తీరును హరీశ్ రావు తప్పుపట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరడం, అగౌరపరచడంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని ఆయన అభివర్ణించారు.
లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఏడేళ్లుగా ఖాళీగా ఉంచడాన్ని రాజ్యాంగ శూన్యత అని పీఏసీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ అనడం హాస్యాస్పదంగా ఉందని హరీశ్ రావు అన్నారు. వేణుగోపాల్ చెప్పిన మాటలు నిజమే కావచ్చు, కానీ అదే సూత్రం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తించదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావొస్తున్నా.. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎందుకు భర్తీ చేయడం లేదని ఆయన నిలదీశారు. ఢిల్లీలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని గొంతు చించుకునే కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీలు తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై ఏం సమాధానం చెబుతారు? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? అని హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు.
రాజ్యాంగ విలువల గురించి ఢిల్లీలో నీతులు చెప్పే కాంగ్రెస్, తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాల్లో వ్యవస్థలను ఖూనీ చేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలనే కాంగ్రెస్ కూడా తెలంగాణలో రిపీట్ చేస్తోందని, ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో పోటీ పడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట.. లేనప్పుడు మరో మాట మాట్లాడటం కాంగ్రెస్ నైజమని ఆయన పేర్కొన్నారు. ఈ దొంగ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారని,
అధికార దాహంతో ఈ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని అగౌరవపరచడం అత్యంత సిగ్గుచేటని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, రాజ్యాంగబద్ధమైన పదవులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.