హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రజలకు అందించే స్వచ్ఛమైన మిషన్ భగీరథ తాగునీటి విషయంలోనూ లాభనష్టాలను బేరీజు వేసే ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం అంటే రియల్ఎస్టేట్ సంస్థా? అని ప్రశ్నించారు. ప్రజల యోగక్షేమాలను లాభనష్టాలతో పోల్చేవారు వ్యాపారవేత్తలు అవుతారే తప్ప పాలకులుకారని చురకలేశారు. మిషన్ భగీరథ పథకంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు నిరంతరం సురక్షితమైన మంచినీరు అందించాలనే గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చిందని వివరించారు. ఈ పథకం ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదు కనుకనే మిషన్ భగీరథ దండుగ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
మిషన్ భగీరథ పథకం కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తే, దానిని రూ.50 వేల కోట్లకు పెంచి చెప్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని హరీశ్రావు ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథపై కాంగ్రెస్ సర్కారుకు ఉన్న భావదారిద్య్రానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టారు కానీ, ఫలితం లేదని పదే పదే విమర్శిస్తున్న సీఎం రేవంత్రెడ్డి తీరును హరీశ్రావు తీవ్రంగా ఆక్షేపించారు.
కొన్ని పెట్టుబడులకు ప్రత్యక్షంగా లాభం వస్తే మరికొన్నింటికి పరోక్ష ఫలితాలు ఉంటాయని హరీశ్రావు స్పష్టంచేశారు. ‘ఆసరా పెన్షన్ల ద్వారా కూడా వేల కోట్లు ఖర్చు అవుతుంది. వీటివల్ల లాభం లేదంటారా? రైతుబంధును లాభం లేని పథకమని రద్దు చేస్తారా? ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యం లాంటి పథకాల వల్ల కూడా ప్రత్యక్ష లాభం కనిపించదు కాబట్టి వాటిని రద్దు చేస్తారా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎవరి ఎత్తు ఎంతో ప్రజలకు తెలుసని హరీశ్ పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ప్రతిసారీ తన ఎత్తును ప్రస్తావించడంపై ఆయన స్పందించారు. ‘నేను కూడా మీ ఎత్తు గురించి మాట్లాడితే సంసారవంతంగా ఉండదు. ఎవరి ఎత్తు ఎంత అనేది ప్రజలకు అవసరం లేదు. ప్రజల కోసం ఎవరెంత ఆలోచిస్తున్నారో, ఎవరెంత పనిచేస్తున్నారో మాత్రమే వారికి అవసరం’ అని వ్యాఖ్యానించారు.