Harish Rao | చెప్పేది కొండంత ..చేసేది గోరంత కూడా లేదు అన్నట్లుంది సీఎం రేవంత్ రెడ్డి తీరు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎల్బీస్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని అన్నారు. ఊహించినట్లు గానే తామే రిక్రూట్మెంట్ చేసినట్లు డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచించిందని ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి కల్లిబొల్లి మాటలు చెప్పారని హరీశ్రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ తన అబద్దాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి, నియామక పత్రాలు ఎలా ఇచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తమకు కుళ్లు లేదు కడుపులో నొప్పి లేదని అన్నారు. సొమ్మొక్కడిది సోకు ఇంకొకడిది అన్నట్టు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంలో రేవంత్ వ్యవహరించిన తీరునే తప్పు బడుతున్నామని స్పష్టం చేశారు.
కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈ నర్సుల నియామక పత్రాలు ఇచ్చిన విషయాన్ని మరచిపోవద్దని హరీశ్రావు గుర్తుచేశారు. నర్సులుగా ఉద్యోగాలు పొందిన వారికి కూడా వాస్తవాలు తెలుసని అన్నారు. తెల్లారితే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారని.. అయన ప్రసంగంలో దీని గురించి ఒక్క మాట కూడా లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రచారం చేశారని గుర్తు చేశారు. అప్పుడు పత్రికల్లో మొదటి పేజీలో ప్రకటనలు గుప్పించి.. ఇప్పుడు నోరూమెదపడం లేదని ఎద్దేవా చేశారు..
తాము యదార్థాలు చెబితే, శాపనార్థాలు అని మాట్లాడారు తప్ప నోటిఫికేషన్ల గురించి చెప్పలేదని హరీశ్రావు అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే అని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారని అన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పెంపు, రూ. 500 లకు గ్యాస్ సిలిండర్, 4000 నెలవారీ పింఛన్, మహాలక్ష్మి ద్వారా నెలకు రూ. 2500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి అమలు కానీ హామీల లిస్ట్ లో నేడు జాబ్ క్యాలెండర్ కూడా చేరిందని విమర్శించారు.
అసలు ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల బాధల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిదని హరీశ్రావు ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది 10 వేల ఉద్యోగాలు మాత్రమే కాదా? అని నిలదీశారు. అప్పుడు నిరుద్యోగ యువతను మోసం చేసింది చాలక ఇపుడు మరో సారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరని మండిపడ్డారు. ఉద్యోగ నియామకాల్లో తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని తెలిపారు. తొమ్మిదనరేళ్లలో 1.65 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 40 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వం మీద ఉద్యోగాల భర్తీకి సంబంధించి రేవంత్ మాట్లాడినదంతా వట్టి డొల్ల అని నేటి కార్యక్రమం రుజువు చేసిందని హరీశ్రావు అన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ కి మీరు చేసిన వాగ్ధానాన్ని నిలుపుకుంటే స్వాగతిస్తామని అన్నారు. సీఎం హోదాలో తప్పుడు మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టవద్దవద్దని హితవుపలికారు. రోజూ అబద్దాలు మాట్లాడే రేవంత్కు కనీసం కాంగ్రెస్ అధిష్టానం అయినా గడ్డి పెట్టాలని కోరుతున్నా అని ఎద్దేవాచేశారు.