హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ను రద్దుచేసి ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాట మార్చి మడమ తిప్పిందని, ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నో ఎల్ఆర్ఎస్-నో బీఆర్ఎస్’ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, గతంలో తాము చేసిన ప్రకటనకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలుచేయాలని, లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.