హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలన అంటేనే దగా అని, అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రైతుల ధాన్యానికి ఇచ్చే బోనస్, రుణమాఫీ, ఉచిత కరెంట్, రైతుబంధు.. ఇలా అన్నింటా దగా చేస్తున్నదని మండిపడ్డారు. జహీరాబాద్ ఎంపీ టికెట్ మున్నూరుకాపులకు ఇవ్వాలని ఆ సంఘం నేతలు శనివారం తెలంగాణభవన్లో హరీశ్రావును కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉండగా రాష్ట్రంలో ఏ రోజూ కరెంటు పోలేదని, నిన్న ఒక ఊరికి వెళ్తే కరెంట్ కోతలు మొదలయ్యాయని రైతులు అవేదన చెందారని తెలిపారు. పదేండ్లలో ఎలాంటి బాధ లేకుండా చూసుకున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ వంద రోజుల్లో 13 హామీలు అమలు చేస్తామని చెప్పిందని, డిసెంబర్ 9నాడే రుణమాఫీ అన్నదని, ఎన్ని 9 తేదీలు మారినా రుణమాఫీ కావటం లేదని విమర్శించారు.
ఆ పార్టీ గురించి చెప్పుకుంటూ పోతే మొత్తం 420 దగాలు ఉన్నాయని వివరించారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఈ మాత్రం కరెంటు ఇస్తున్నారని, ఎన్నికలు పూర్తయితే కరెంట్ కోతలు పూర్తి స్థాయిలో ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్ఎస్ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పోరాటంతోనే సాధ్యం అవుతుందని చెప్పారు. రుణమాఫీ, రైతు బంధు, కరెంట్, బోనస్ ఇవ్వనందుకు రైతులు ఏకమై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు చురుకు పెట్టాలని అన్నారు. మన వేలితో మన కన్ను పొడుచుకోవద్దని, తప్పిపోయి కాంగ్రెస్కు ఓటు వేయొద్దని, బాండ్ పేపర్ ఇచ్చి రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే హామీలు అమలు అవుతాయని తెలిపారు. రెండు సార్లు గెలిపిస్తే పార్టీకి మోసం చేసిన చరిత్ర బీబీపాటిల్ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్నూరుకాపులకు జహీరాబాద్ ఎంపీ టికెట్ వినతిని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్, గాలి అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.