Harish Rao | రాష్ట్రంలో రైతు ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అని మండిపడ్డారు. అన్నారం బరాజ్ పరిశీలన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు.
ప్రతిపక్షాలు లేవనెత్తిన వాటికి సమాధానం చెప్పకుండా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్రావు ధ్వజమెత్తారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పొద్దనే కేసీఆర్ మీటింగ్ నాడు నల్లగొండలో మీటింగ్ పెడితే.. ఆ దెబ్బకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇవాళ మేం చలో మేడిగడ్డ పర్యటనకు బయల్దేరితే.. అదే సమయానికి కాంగ్రెస్ పాలమూరు ఎత్తిపోతల యాత్ర పెట్టారు. ఇది చిల్లరమల్లర ప్రయత్నం తప్ప ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ప్రతిపక్షానికి స్పేస్ లేకుండా తామే మొత్తం ఆక్రమించుకోవాలని చూస్తోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచిక ఆనందం. ఇది ప్రభుత్వం అవలంభించే పద్ధతి కాదు. ఇది ప్రభుత్వ విధానం కానేకాదు అని హరీశ్రావు స్పష్టం చేశారు.
మేం మేడిగడ్డ బయల్దేరగానే.. కాగ్ రిపోర్టు మీద మీటింగ్ పెట్టారు. ఉత్తమ్ ప్రెస్మీట్లు పెట్టడం, పాలమూరు యాత్ర పెట్టడం అంటే మేం విజయం సాధించినట్టే. నాడు నల్లగొండలో కేసీఆర్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి, అసెంబ్లీలో తీర్మానం చేయించారు. ఇవాళ మా మేడిగడ్డ యాత్రకు బెంబేలెత్తి.. ఎన్డీఎస్ఏ రిపోర్టు రాగానే మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయిస్తామని ఉత్తమ్ నోట చెప్పించాం. ఈ మాట ఆయన నోటి చెప్పించామంటే మా యాత్ర పాక్షిక విజయం సాధించింది. మేం పెట్టిన ఒత్తిడికి ప్రభుత్వం దిగివస్తుంది. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినా కూడా మేడిగడ్డపై ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఏమన్న అంటే.. ఎన్డీఎస్ఏ రిపోర్టు అని కాలయాపన చేశారు. వర్షాకాలంలో ప్రాజెక్టును పూర్తిదెబ్బ తీయాలనే కుట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతోందని హరీశ్రావు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్న కుట్రలను బట్టబయలు చేయాలని, కాళేశ్వరం సమగ్ర స్వరూపం ప్రజలకు తెలియజేయాలని, ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలను యుద్ధప్రతిపాదికన ప్రారంభించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలని ఇవాళ మేడిగడ్డకు రావడం జరిగింది. రైతుల పక్షాన, ప్రజల పక్షాన పని చేయకుండా.. ప్రతిపక్షం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలి. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి.. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు ఎక్కువగా పొందాలని దుగ్దతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే రైతు ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని హరీశ్రావు పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చాక కూడా గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలం వెల్లదీస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుంది. మెగా ప్రాజెక్టులు కట్టినప్పుడు అక్కడక్కడ సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయి. మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. రైతులకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేయాలని రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అసెంబ్లీలో మాట్లాడారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ధ్వంసం చేసేందుకు కూడా రేవంత్ వెనుకాడరు. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్లు ఉండొద్దనేది రేవంత్ ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని హరీశ్రావు పిలుపునిచ్చారు.