Harish Rao | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేసిందని, తాము ఊహించినట్టుగానే నియామకాలు మొత్తం వాళ్లే చేసినట్టు డబ్బా కొట్టుకున్నారని వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి తీరు చెప్పేది కొండంత.. చేసేది గోరంత కూడా లేదు అన్నట్టున్నదని ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిందని కల్లబొల్లి మాటలు చెప్పిన రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ తన అబద్ధాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి, నియామక పత్రాలు ఇచ్చారా? మాకు కుళ్లు లేదు, కడుపులో నొప్పీ లేదు. సొమ్మొకడిది సోకు ఇంకొకడిది అన్నట్టు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంలో రేవంత్ వ్యవహరించిన తీరునే తప్పు పడుతున్నాం. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈ నర్సుల నియామక పత్రాలు ఇచ్చిన విషయాన్ని మరచిపోవద్దు.
నర్సులుగా ఉద్యోగాలు పొందిన వారికి కూడా వాస్తవాలు తెలుసు. తెల్లారితే గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్రెడ్డి నీళ్లు చల్లారు. అయన ప్రసంగంలో దీని గురించి ఒక మాట లేదు. ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రచారం చేశారు. పత్రికల్లో మొదటి పేజీలో ప్రకటనలు గుప్పించారు. ఇప్పుడు నోరు మెదపటం లేదు. మేము యదార్థం చెబితే, శాపనార్థాలు అని మాట్లాడారు తప్ప నోటిఫికేషన్ల గురించి చెప్పలేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే అని రేవంత్ మరోసారి నిరూపించారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు పెంపు, రూ.500కు సిలిండర్, రూ.4 వేల పింఛన్, మహాలక్ష్మి ద్వారా రూ. 2500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, నిరుద్యోగ భృతి వంటి అమలు కానీ హామీల లిస్ట్ లో జాబ్ క్యాలెండర్ కూడా చేరింది.
అసలు ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల బాధల గురించి మాట్లాడే హకు కాంగ్రెస్కు ఎకడిది. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది 10 వేల ఉద్యోగాలు మాత్రమే కాదా? అప్పుడు నిరుద్యోగ యువతను మోసం చేసింది చాలక ఇప్పుడు మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నదెవరు? ఉద్యోగ నియామకాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిం ది. తొమ్మిదిన్నరేండ్లలో లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 40 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది వాస్తవం కాదా? కేసీఆర్ ప్రభుత్వం మీద ఉద్యోగాల భర్తీకి సంబంధించి రేవంత్ మాట్లాడినదంతా డొల్ల అని రుజువైంది’ అని మండిపడ్డారు. సీఎం హోదాలో తప్పుడు మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టవద్దని, రోజూ అబద్ధాలు మాట్లాడే రేవంత్కు కనీసం కాంగ్రెస్ అధిష్ఠానమైనా గడ్డి పెట్టాలని హితవు చెప్పారు.