సిద్దిపేట నియోజకవర్గం తరఫున అందజేత
త్వరలో మరో కిలో అందజేస్తానని వెల్లడి
యాదాద్రి, ఫిబ్రవరి 3 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపుర స్వర్ణతాపడానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కిలో బంగా రం అందజేశారు. గురువారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి హరీశ్రావు దంపతులు బాలాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్రావు దంపతులకు స్వామివారి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం విమాన గోపురం స్వర్ణతాపడానికి సిద్దిపేట నియోజకవర్గం తరఫున కిలో బంగారాన్ని ఆలయ ఈవో ఎన్ గీతకు అందజేశారు. త్వరలో మరో కిలో బంగారం అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే విమానగోపురం స్వర్ణతాపడానికి 35 కిలోల బంగారం భక్తుల నుంచి వచ్చిందని, మరో 45 కిలోలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అనంతరం పునఃప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతనాలయాన్ని పరిశీలించారు.