Harish Rao | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సాక్షిగా మహిళా లోకాన్ని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచామని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సభా సంప్రదాయాలను తుంగలో తొకుతూ, ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయమని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం తప్పా? రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల మరణాలు, ఆటో కార్మికుల బలవన్మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పా? విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తడమే తప్పా? అని హరీశ్రావు ప్రశ్నించారు. మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని, కాంగ్రెస్ చేస్తున్న ఒకో తప్పును లెకబెడుతున్నారనే విషయాన్ని రేవంత్ సర్కార్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.