హైదరాబాద్: ప్రతిపక్షం నిలదీస్తే గానీ ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం బీఆర్ఎస్ విజయమని చెప్పారు. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని, పెరిగిన ద్రవ్యోల్బణం ఆధారంగా రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి, తాము మిమ్మల్ని ప్రశ్నిస్తుంటాం, నిలదీస్తూనే ఉంటామని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
‘పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో పాటు, పత్రికా సమావేశం నిర్వహించి నిలదీస్తే గాని ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదు. కుల గణన దరఖాస్తులతోపాటు, ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం, ఇది తుది జాబితా కాదని, దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చెప్పించడం బిఆర్ఎస్ విజయం. ఆదాయ పెంపు విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండటం వల్ల లక్షల మంది నిరుపేద వర్గాలు రేషన్ కార్డులకు దూరం అవుతాయని మరొక్క సారి గుర్తు చేస్తున్నాం.
కేసీఆర్ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పొందేందుకు వీలుగా ఆదాయ, భూ పరిమితి నిబంధనల్లో మార్పులు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదాయ పరిమితి గ్రామీణంలో 60వేలు, పట్టణంలో 75వేలు ఉంటే, దాన్ని గ్రామీణంలో లక్షా 50వేలకు, పట్టణంలో 2.50 లక్షలకు పెంచారు. మాగాణి రెండున్నర ఎకరాలు, మెట్ట 5 ఎకరాలుగా ఉన్న పరిమితిని మాగాణి మూడున్నరకు, మెట్ట ఏడున్నర ఎకరాలకు పెంచారు. దీనివల్ల లక్షల మంది నిరుపేదలకు రేషన్ కార్డు పొందే అర్హతను కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది.
పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితి తోపాటు భూ పరిమితి పెంచుతూ నిబంధనల్లో మార్పు చేయాలని తెలంగాణ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఆశాలు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు.. ఇతర అల్ప ఆదాయ వర్గాలు, పేదలు రేషన్ కార్డులు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నాం.ఇతర అల్ప ఆదాయ వర్గాలు, పెదాలు రేషన్ కార్డులు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నాం. పల్లెల్లో అయినా పట్టణంలో అయినా కూలీ ఎక్కడైనా నిరుపేదే. కాబట్టి పల్లెలు పట్టణాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని, 20 రోజుల పనిదినాల నిబంధన తొలగించాలని, భరోసా పథకాన్ని ఉపాధి హామీకి లింకు చేయకుండా అర్హులైన అందరికీ వర్తింప చేయాలని కోరుతున్నాం. నిరుపేదలకు ఆసరాగా ఉండే రేషన్ కార్డు జారీ ప్రక్రియలో ప్రభుత్వం కోతలు విధించడం సరికాదని హితవు పలుకుతున్నాం.’ అని హరీశ్రావు ట్వీట్ చేశారు.
🔹 ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా?
🔹 ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బిఆర్ఎస్ విజయం.
🔹 మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
🔹 దరఖాస్తులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని…
— Harish Rao Thanneeru (@BRSHarish) January 19, 2025