Harish Rao | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పథకంలో లక్షలాది అర్హులకు అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. పథకంలోని లోపాలను సరిచేసి, అర్హులందరికీ అమలయ్యే విధంగా చూడాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి హరీశ్రావు లేఖరాశారు. కేవలం 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికే అధికారులు జీరో బిల్లు ఇస్తున్నారని, ఒక యూనిట్ ఎకువ వచ్చినా సరే, మొత్తం 201 యూనిట్లకు బిల్లు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. వినియోగదారులు ప్రతిరోజూ తాము ఎంత కరెంటు వాడుతున్నామో, మీటర్ ఎంత తిరుగుతున్నదో లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఫ్యాన్ వేసుకోవాలా? వద్దా? లైట్ వేసుకోవాలా? వద్దా? అనేది మీటర్ రీడింగ్ చూసి నిర్ణయించుకోవాల్సిన దుస్థితికి పేదలను నెట్టడం బాధాకరమని పేర్కొన్నారు.
200 యూనిట్ల కన్నా ఎకువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని విజ్ఞప్తిచేశారు. 200 యూనిట్లు దాటితే, 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి, మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని కోరారు. రాష్ట్రంలో 90 లక్షల మందికి తెల్లరేషన్ కార్డులు ఉంటే, ప్రభుత్వం 30 లక్షల మందికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. మిగిలిన 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్లో 30 లక్షల మంది పేదలు ఉంటే, 10 లక్షల మందికే పథకం అమలుచేయడంతో మిగతా వారికి నష్టం కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం మూడో వంతు పేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నదని తెలిపారు.
ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒక రేషన్ కార్డులో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి బతుకుతున్నారని, వారు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో, వేర్వేరు అంతస్థుల్లో ఉంటున్నారని వివరించారు. కానీ, ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెకగట్టి ఒకరికే పథకం వర్తింపజేస్తున్నదని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని, అన్ని కుటుంబాలకూ పథకాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే, మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి కలిగేలా చూడాలని కోరారు. అలా చేయని పక్షంలో ఈ పథకం కేవలం నామమాత్రంగానే మిగిలిపోతుందని, హామీల అమలుకు ప్రభుత్వమే తూట్లు పొడిచినట్టు అవుతుందని పేర్కొన్నారు. నిజంగా పేదలకు సాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, వెంటనే పై మూడు విషయాల్లో తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.