Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో ఎంఎస్ఎంఈలు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతపడ్డా.. రాష్ట్రంలో అనుసరించిన టీఎస్ఐపాస్ లాంటి విధానాలు ఎంఎస్ఎంఈలను దృఢంగా నిలిపాయని బుధవారం ఎక్స్ వేదికగా తెలిపారు.
పెట్టుబడుల్లో 115 శాతం పెరుగుదలతో దేశంలో అగ్రగామిగా నిలవడమే కాక.. ఉద్యోగాల కల్పనలో 20శాతం వృద్ధిరేటు సాధించిందని చెప్పారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు 30శాతం ఉద్యోగావకాశాలు లభించాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పాలనలో సాధించిన ఘనతను వారి ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎంఎస్ఎంఈ అభివృద్ధికి తాము చేసిన కృషి ఏమిటో, భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో చెప్పకుండా గత ప్రభుత్వ విజయాలతో కాలం గడపడం శోచనీయమని మండిపడ్డారు.