హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులను ఏమి ఉద్ధరించారని రైతు విజయోత్సవాలు జరుపుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడాదిగా రైతులను దగా చేసి, రైతు పండుగ పేరిట మూడు రోజులు విజయోత్సవాలు జరపాలని ప్రభు త్వం నిర్ణయించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు బాకీ పడ్డ రూ.40,800 కోట్లతోపాటు ఈ యాసంగి సీజన్కు ఇవ్వాల్సిన రైతుభరోసా కూడా వెంటనే విడుదల చేసి పండుగ చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘రేవంత్రెడ్డీ.. ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా దగా చేసినందుకు రైతు పండుగ అంటూ మూడు రోజుల విజయోత్సవాలు చేస్తున్నవా? వరంగల్ రైతు డిక్లరేషన్లోని తొమ్మిది హామీల్లో ఒకటీ అమలుచేయనందుకు పండుగ చేస్తున్నవా? రుణమాఫీ ఎగ్గొట్టి, రైతుభరోసా బోగస్ చేసి, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఏడిపించినందుకు చేస్తున్నవా? మీ ఏడాది దుర్మార్గ పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నవా?’ అని హరీశ్రావు ప్రశ్నించారు.
రైతులను మభ్యపెట్టి అధికారంలోకి..
రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి, వారిని నిండా ముంచారని హరీశ్రావు దుయ్యబట్టారు. ‘రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులకు చేసిందేమిటి? కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు పథకానికి ఎగనామం పెట్టింది. నూటొక దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. సగం మందికి మొండిచెయ్యి చూపారు. 24 గంటల నాణ్యమైన కరెంటు అందించలేక చేతులెత్తేశారు. పంటలకు మద్దతు ధర లేదు. అన్ని పంటలకు బోనస్ అసలే లేదు. కొనుగోలు కేంద్రాలు లేవు. కౌలురైతులకు, రైతుకూలీలకు ఇస్తానన్న భరోసాకు దికులేదు. రైతులకు మీరు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతు పండుగ నిర్వహించడం సిగ్గుచేటు. పైగా, ఏడాది పాలనలో రైతు సంక్షేమం కోసం రూ.54,280 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రచారం చేసుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉన్నది. రైతుబీమా, ఉచిత విద్యుత్తు, ధాన్యం కొనుగోళ్ల కోసం మీరు ఖర్చు చేసినట్టు చెప్పిన రూ.27,486 కోట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందే. కానీ, కొత్తగా తామేదో రైతులకు చేసినట్టు డబ్బా కొట్టుకోవడం రైతులను మరోసారి మోసం చేయడమే. ఇదేనా కాంగ్రెస్ మారు మార్పు?’ అని హరీశ్రావు నిలదీశారు.
ఏడాదిలో రైతులకు 40,800 కోట్లు బాకీ
కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రకారం తెలంగాణ రైతులకు రేవంత్రెడ్డి సర్కార్ రూ.40,800 కోట్లు బాకీ పడిందని హరీశ్రావు వివరించారు. రుణమాఫీ కింద దాదాపు రూ. 14,000 కోట్లు, వానకాలం రైతుబంధు కింద రూ.7,500 కోట్లు, కౌలురైతులకు రూ.3,000 కోట్లు, రైతు కూలీలకు రూ.1,600 కోట్లు, అన్ని పంటలకు బోనస్ కింద సుమారు రూ.3,000 కోట్లు, అకాల వర్షాలకు పంట నష్టం కింద సుమారు రూ.11,700 కోట్లు (కేంద్రానికి రాష్ట్రం పంపిన రిపోర్టు). ఇలా ఏడాది కాలంలో మొత్తం రూ.40,800 కోట్లు రైతులకు బాకీ పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు.