Harish Rao | గతేడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదన్నారు. రుణమాఫీ పూర్తి చేయలేదని.. రైతు బంధును నిలిపివేశారని.. రైతు భరోసా దిక్కులేకుండా పోయింది, బోనస్ను బోగస్ చేశారని ఆరోపించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారని.. పది నెలలు గడిచినా అతీగతి లేదన్నారు. నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారని విమర్శించారు. ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ - బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించాలని పిలుపునిచ్చారు. మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లపై ఎక్కడిక్కడ నిలదీయాలన్నారు.