హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సెస్ సూచనలు ఎంతో విలువైనవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సెస్ అధ్యయనాలు ప్రభుత్వాలకు వెన్నెముక వంటివని చెప్పారు. శుక్రవారం ఆయన బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)లో రూ.5 కోట్లతో నిర్మించిన విద్యార్థినుల వసతిగృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ వసతిగృహం కార్పొరేట్ స్థాయిలో ఉన్నదని కొనియాడారు. ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్ కాన్సెప్ట్ విధానంలో నిర్మించిన ఈ హాస్టల్లో 19 గదులు ఉన్నాయని, 40 మంది వరకు వసతి పొందవచ్చని తెలిపారు. నిరుడు ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసుకుని, ఏడాదిలోపే పూర్తిచేసుకోవడం హర్షణీయమ ని చెప్పారు. సెస్కు జాతీయ స్థాయిలో ఎంతో మంచి పేరు ఉన్నదని, ఇకడి పీహెచ్డీ కోర్సుకు మంచి డిమాండ్ ఉన్నదని, వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు చేరుతున్నారని వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం సెస్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికపుడు విలువైన సూచనలు చేస్తున్నదని పేర్కొన్నారు. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం, దేశమైనా పురోగతి సాధిస్తుందని తెలిపారు.
ప్రభుత్వ విధానాలు, పథకాల రూపకల్పన, అమలులో సామాజిక అధ్యయనాలు ఎంతో అవసరమని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒక పథకం అమలు చేసే ముందు ప్రజాకోణంలో ఆలోచిస్తారని తెలిపారు. అందుకే రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకం విజయవంతం అవుతున్నదని, ఆ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం బాల్య వివాహాలను తగ్గించిందని వివరించారు. పార్లమెంట్ చట్టాలు చేయలేనిది కల్యాణలక్ష్మి చేసి చూపిందని తెలిపారు. కేసీఅర్ కిట్తో వందశాతం ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. స్వాతంత్య్ర భారతదేశంలో దశాబ్దాలుగా ఎంతోమంది పాలకులు చేయలేనిది సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో చేసి చూపించారని కొనియాడారు. సామాజిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ పాలసీలు రూపొందించాల్సి ఉంటుందని, అప్పుడే అవి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పథకాల రూపకల్పనకు సహకరిస్తున్న సెస్కు అన్నివిధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. సెస్ సేవలను భవిష్యత్తులో మరింత వినియోగించుకుంటామని తెలిపారు. సెస్ డైరెక్టర్ రేవతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో సెస్ ఫౌండర్ సభ్యులు జే మహేందర్రెడ్డి, జీఆర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్, ఇంజినీర్ మానస్కుమార్ తదితరులు పాల్గొన్నారు.