ఖమ్మం, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/తొర్రూరు:కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్లు అన్ని రంగాల్లో విఫలం కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ వన్గా నిలిచి ప్రజలకు సుఫలాలు అందిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కేంద్రంలోని రైతు వ్యతిరేక బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని, ఆ పార్టీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో రైతు రాజ్యం నెలకొల్పేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని స్పష్టంచేశారు. రైతు వ్యతిరేక బీజేపీపై సమరం సాగించేందుకు నిర్వహిస్తున్న ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. రైతు బాంధవుడికి, రైతు వ్యతిరేకులకు మధ్య జరిగే పోరాటానికి దిక్సూచిగా నిలిచే ఖమ్మం సభకు ప్రజలు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి జాతరలా తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం బొజ్జాయిగూడెం, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో సన్నాహకసభలు నిర్వహించారు. ఆయా సభల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందని చెప్పారు. సభ అనంతరం దేశంలో అనేక అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని అన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణ పథకాలు అందరినీ ఆకర్షిస్తున్నాయని వివరించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేసి ఆచరిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ర్టాలు ఈ పథకాలను అనుసరిస్తున్నాయన్నారు.
మన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టి హర్ ఘర్ జల్, రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్ సమ్మాన్, మిషన్ కాకతీయ పథకాన్ని అమృత్ సరోవర్ పేరుతో అమలు చేస్తున్నదని ఉదహరించారు. దేశంలో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కేంద్రంలోని బీజేపీపై కదనభేరి మోగించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని, ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్మాన్, పినరాయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా వంటి జాతీయస్థాయి నేతలు రావడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. తెలంగాణ వాళ్లకు నాయకత్వ పటిమ లేదని, ఐక్యత లేదని, పరిపాలన చేతకాదని గతంలో హేళన చేశారని, కానీ సీఎం కేసీఆర్ నేడు దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తూ జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తూ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నారని వివరించారు.
దేశంలో, రాష్ర్టాల్లో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్లతో కర్షకులు కష్టాలు ఎదుర్కొంటున్నారని హరీశ్రావు విమర్శించారు. ఇటీవల మధ్యప్రదేశ్లో ఎరువుల కోసం తొక్కిసలాట జరిగితే ఏడుగురు రైతులు చనిపోయారని గుర్తు చేశారు. నల్ల చట్టాలు తెచ్చిన రైతు వ్యతిరేక బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 68 లక్షల టన్నుల ధాన్యం పండితే, నేడు రాష్ట్రంలో 2.49 కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నదని చెప్పారు. ఈ పంటను కొనలేక చేతులేత్తిసిన కేంద్రం తెలంగాణ ప్రజలు నూకలు బుక్కండి అంటూ అవహేళన చేసిందని మండిపడ్డారు.
రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈజీఎస్ నిధులతో ధాన్యం ఆరబోసుకోవడానికి కల్లాలు నిర్మించిందన్న కండ్ల మంటతో రాష్ర్టానికి రావాల్సిన రూ.1,200 కోట్లు కేంద్రం నిలుపుదల చేసిందని, దీంతో గ్రామ పంచాయతీలకు ఆరు నెలలుగా నిధులు ఇవ్వకుండా వారి ఉసురుపోసుకుంటున్నారని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లాలు కట్టారని బిల్లులు ఆపుతారా? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. మోటర్లకు మీటర్లు పెట్టలేదని రూ.30 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేయకుండా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుననదని మండిపడ్డారు. ఒక్కసారి బీజేపీ కుట్రలపై ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం వ చ్చేదా? ఎస్సారెస్పీతో రెండు పంటలకు నీళ్లు వచ్చేవా? ఉచిత కరంట్ అందేదా? పెట్టుబడికి పైసలు వచ్చేవా? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేదే బీఆర్ఎస్ ప్రభుత్వమైతే, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేది బీజేపీ సర్కార్ అని హరీశ్రావు ఎద్దేవాచేశారు. దేశంలోని అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైనదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
బీజేపీకో హఠావో.. సింగరేణి బచావో.. నినాదంతో తెలంగాణ ప్రజలు మరోసారి ఉద్యమపథంలో పయనించాల్సిన సమ యం ఆసన్నమైందని హరీశ్రావు పిలుపునిచ్చారు. రైల్వేస్టేషన్లు, రైల్వేలైన్లతోపాటు సింగరేణి బొగ్గు బావులను సైతం ప్రైవేట్కు అప్పజెప్పేందుకు, వాటిని తెగనమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. బొగ్గుకు పునాది రాయి వేసుకున్న తెలంగాణలో బీజేపీ వంటి పార్టీలు మనజాలవని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి స్థానం లేదని తేల్చిచెప్పారు.
బొగ్గుగుట్టగా ఉన్న ఇల్లెందును అన్ని విధాలా అభివృద్ధి చేసి బంగారుగుట్టగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొనియాడారు. నాలుగేండ్లలో ఇల్లెందు పట్టణంలో జరిగిన అభివృద్ధి మరెప్పుడూ జరగలేదని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లెందులోని అన్ని మండలాలకు సాగునీరు అందేలా ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ఒప్పించారని, అభివృద్ధిలో ఇల్లెందు అగ్రగామిగా ఉన్నదని ప్రశంసించారు. కన్నతల్లిలాంటి పార్టీలో పదవులు పొంది పార్టీకే ద్రోహం చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చినా సరికాదని, పార్టీకి ద్రోహదం చేయరాదన్న విజ్ఞత వారికి ఉండాలని హితబోధ చేశారు. ఇల్లెందు బస్డిపో, కూరగాయల మార్కెట్ను ఫిబ్రవరి మొదటివారంలో మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. బీజేపీది డబుల్ఇంజిన్ సర్కార్ కాదని, అది ట్రబుల్ఇంజిన్ సర్కారు అని ఎద్దేవా చేశారు. గుజరాత్ మాడల్ గోల్మాల్ మాడల్ అని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు ఎదురులేదని, బీజేపీతో ఏమీకాదని స్పష్టం చేశారు.
ప్రజల కోసం పని చేసే శక్తి గల నాయకుడు సీఎం కేసీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. ఇప్పుడు దేశమంతా సీఎం కేసీఆర్ వైపే చూస్తున్నదని అన్నారు. దేశానికి దశ, దిశ నిర్దేశించగలిగిన సత్తా ఉన్న నాయకుడిగా కేసీఆర్ను దేశం భావిస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ఖమ్మం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం సభ ద్వారా దేశ రాజకీయ ముఖచిత్రంలో మార్పులు సంభవిస్తాయని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో ఇల్లెందు నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, డీఎస్ రెడ్యానాయక్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.