Harish Rao | రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రేమో రుణమాఫీ పూర్తి చేసినట్లు డబ్బా కొడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం రుణమాఫీ పూర్తి కాలేదంటున్నరని అన్నారు.
మొన్న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రూ.18వేల కోట్లతో రుణమాఫీ పూర్తిగా చేసినట్లు ప్రకటిస్తే, ఇందుకు భిన్నంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, ఇంకా 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామని అన్నారని హరీశ్రావు గుర్తుచేశారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారని అన్నారు. ఇక ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే పచ్చి అబద్దం చెప్పారని మండిపడ్డారు. ఏకంగా 31వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించారని తెలిపారు. ఏది నిజం అని ప్రశ్నించారు. ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ముఖ్యమంత్రి చెప్పాలె అని స్పష్టం చేశారు.
ఒకవైపు రుణమాఫీ కాక రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తుంటే, భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి మరింత గందరగోళం సృష్టిస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. మీరు చెబుతున్నట్లు రుణమాఫీ జరిగి ఉంటే బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, కలెక్టరేట్ల చూట్టూ రైతులు ఎందుకు చెప్పులరిగేలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఎందుకు రోడ్లెక్కి రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారని నిలదీశారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ పూర్తి కాలేదన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి ఒప్పుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. వెంటనే రుణమాఫీ పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 వరకు రైతులందరిరీ రుణవిముక్తులుగా చేస్తానన్న హామిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.