కేసీఆర్ హయాంలో కట్టిన భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తుండు. 2021లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ.300 కోట్లతో నర్మెటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పూర్తయింది. శ్రమ బీఆర్ఎస్ది.. శిలాఫలకం రేవంత్ది. శిలాఫలకాల మీద మీ పేరు ఉండొచ్చు రేవంత్రెడ్డీ.. సిద్దిపేట ప్రజల మనోఫలకాలపై ఉండేది మాత్రం కేసీఆర్ పేరే.
– హరీశ్రావు
సిద్దిపేట, మార్చి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేటపై సీఎం రేవంత్రెడ్డి రాజకీయ కక్ష గట్టారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. ఏకంగా రూ.1,070కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పనులు మొదలైన సిద్దిపేట వెటర్నరీ కాలేజీని రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్కు ఎత్తుకుపోయారని ధ్వజమెత్తారు. రెండున్నరేండ్లలో సిద్దిపేట నియోజకవర్గానికి కొత్తగా మంజూరు చేసింది ఒకటీ లేదని దుయ్యబట్టారు. ఆదివారం సిద్దిపేటలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించబోయే అభివృద్ధి కార్యక్రమాలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించి, నిర్మించినవేనని చెప్పారు. తమ శ్రమఫలితానికి.. రేవంత్రెడ్డి శిలాఫలకాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు హరీశ్రావు తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన, సిద్దిపేటపై కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపు తీరును ఎండగడుతూ ముఖ్యమంత్రి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. నర్మెట్టలో ఇవాళ రేవంత్ ప్రారంభించబోతున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని పేర్కొన్నారు. టీజీఐఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని సేకరించి, రైతులను ఒప్పించి మొకలు నాటించామని హరీశ్రావు గుర్తుచేశారు.
నాడు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎగతాళి చేసిన రేవంత్రెడ్డి.. ఇవాళ అదే కాళేశ్వరం జలాలతో నడిచే ఫ్యాక్టరీని ప్రారంభిస్తుండటం శోచనీయమని పేర్కొన్నారు. పకనే పారుతున్న కాళేశ్వరం కాలువ నీళ్లను రేవంత్రెడ్డి తన నెత్తిన చల్లుకొని ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేయాలని సూచించారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసి ఎన్ని కుట్రలు చేసినా మొకవోని దీక్షతో పూర్తి చేసి ఈ నేలకు జలాలను అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రిగా నాడు తాను మంజూరు చేసి, నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలకు ముఖ్యమంత్రి ఇవాళ రిబ్బన్ కటింగ్ చేస్తున్నారన్నారు. రూ.3.60కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్, రూ.25 కోట్లతో ఆయుష్ దవాఖాన, గట్ల మల్యాలలో రూ.1.40 కోట్లతో పీహెచ్సీ, సిద్దిపేట అర్బన్ పీహెచ్సీ భవనాలు కట్టింది బీఆర్ఎస్ సర్కారేనని వివరించారు. ఎన్నికల కోడ్ వల్ల ప్రారంభానికి నోచుకోకపోయినా ఇప్పటికే సేవలందిస్తున్నాయని చెప్పారు. అయితే సిబ్బందిని నియమించకుండానే వాటికి శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆలయాలు, విద్యాలయాలతో పాటు రూ.78 కోట్లతో 30 ఎకరాల్లో జిల్లా జైలును కట్టించింది కూడా తామేనని గుర్తుచేశారు. బీఆర్ఎస్ కట్టిన భవనాలకు శిలాఫలకాలు వేసుకునేందుకే ముఖ్యమంత్రి ఇవాళ సిద్దిపేటకు వస్తున్నారంటూ హరీశ్రావు ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందు దేవుళ్ల మీద ఒట్లు పెట్టిన రేవంత్రెడ్డి.. రుణమాఫీ పేరిట రైతులను దారుణంగా మోసం చేశారని హరీశ్రావు మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి సర్కార్ రూ.300 కోట్ల బకాయి ఉన్నదని పేర్కొన్నారు. సీఎం పర్యటించే నర్మెట్ట గ్రామంలోనే 350మంది రైతులకు మాఫీకాలేదని.. మరి ఏం ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి సిద్దిపేటకు వస్తున్నారని ప్రశ్నించారు. వరుసగా మూడు సీజన్లకు రైతుబంధు ఎగ్గొట్టారని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024-25 ఏప్రిల్ నెలలో వడగండ్ల వానకు నష్టపోయిన సిద్దిపేట రైతులకు వెంటనే నష్టపరిహారం, బీమా అందించాలని కోరారు.
సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్నది తానే అని చెప్పేందుకు రేవంత్రెడ్డి ఇక్కడికి వస్తున్నారా అని హరీశ్రావు ప్రశ్నించారు. రంగనాయకసాగర్ టూరిజం ప్రాజెక్ట్, కోమటిచెరువుపై శిల్పారామం, సిద్దిపేట ఔటర్రింగ్ రోడ్, అగ్రికల్చర్ కాలేజీ, మిట్టపల్లి ఎస్సీ గురుకులం, సిద్దిపేట స్పోర్ట్స్ స్టేడియం, టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లు, సిద్దిపేట-ఇల్లంతకుంట, సిద్దిపేట-కిష్టాపూర్ ఫోర్లేన్ రోడ్లు, ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ మారెట్ పనులను అర్ధాంతరంగా ఆపేశారని మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతో రద్దు చేసిన రూ.1,070 కోట్ల పనులను ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. లేదు ఖాళీ చేతులతోనే వస్తా.. కత్తెరతో రిబ్బన్ కట్ చేసి వెళ్తా అని అనుకుంటే మాత్రం ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తేల్చిచెప్పారు.