దళిత సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు
ఉమ్మడి జిల్లాలో కొనసాగిన సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం
వేల్పూర్, జూన్ 30: దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని పలువురు దళిత సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు అన్నారు. దళితల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్లో వెయ్యి మంది దళితులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సామూహిక భోజనాలు చేశారు. స్థానిక రైతువేదిక భవనంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ ఎంపీపీ భీమ జమున మాట్లాడుతూ.. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలన్న తపన ఉన్న నాయకుడు కేసీఆర్ అని, అందుకే దళితుల అభ్యున్నతి కోసం దళిత సాధికారత పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారని చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో దళితులందరికీ మేలు చేకూరుతున్నదని తెలిపారు. జడ్పీటీసీలు అల్లకొండ భారతి, తలారి గంగాధర్, మాజీ ఎంపీపీ కల్లెడ చిన్నయ్య, నాయకులు కల్లెడ ఏలియా, పుప్పాల విద్యాసాగర్, నారాయణ, ముత్తెన్న, పొడేటి శంకర్, కమలాకర్, చెప్పాల గంగాధర్ మాట్లాడుతూ.. దళితుల ఆత్మ గౌరవం, ఆర్థిక భరోసా కోసం వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.పది లక్షలు జమ అయ్యేలా సాధికారత పథకాన్ని సీఎం ప్రవేశపెట్టారని వివరించారు. గురువారం నుంచి అన్ని మండలాల్లో కృతజ్ఞత సభలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ద్యావతి మురళి, మంథని చిన్నయ్య, గచ్చంద కల్పన, అనిల్, కర్రె కల్యాణి, నీరడి లత, గంగారాం, మండల గంగారాం, తలారి గంగాధర్, లింగన్న, సాయన్న, పెద్ద మోహన్, పెద్ది గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి దళితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.