వెలివాడల్లో సగర్వంగా సంపాదన
బతుకుతూ.. ఇతరులను బతికిస్తూ
నాడు అడ్డా కూలీలుగా అష్టకష్టాలు
నేడు వ్యాపారవేత్తలుగా కొత్త జీవితం
దళితబంధుతో మారిన బతుకుచిత్రం
తోటివారికి స్ఫూర్తినిస్తున్న విజయాలు
నెరవేరుతున్న సీఎం కేసీఆర్ స్వప్నం
దళిత బంధుకు ఎంపికైన 97 శాతం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున నిధులు జమ
దళితవాడ అంటే..? ఊరి అవతల ఉండే వెలివేసిన ప్రాంతం గుర్తుకొస్తుంది. రెక్కల కష్టం తప్ప ఆస్తులేమీ లేని అభాగ్యులు కండ్లలో మెదులుతారు. కూలి నాలి, కష్టాలు-కన్నీళ్లు, అవమానాలు-అవహేళనలు.. ఇంతకు మించి అక్కడి జీవితాలను వర్ణించడానికి ఏమీ ఉండదు. ఇది నిన్నటి చరిత్ర. దళితబంధు పథకానికి పూర్వపు పరిస్థితి. ఇప్పుడు దళితవాడల్లో కొత్త వసంతం
విరబూస్తున్నది. దళితవాడలు నూతన వ్యాపారవేత్తలను ఆవిష్కరిస్తున్నాయి. సంపద సృష్టికి నిలయాలుగా మారుతున్నాయి. నిన్న మొన్నటి దాకా కూలి పని కోసం ఎదురుచూసినవారు ఇప్పుడు తామే మరో నలుగురికి పని కల్పిస్తున్నారు. ఇది దళితబంధు పథకం సాధిస్తున్న అపూర్వ విజయం. పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం లిఖిస్తున్న కొత్త అధ్యాయం.
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ)/యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎల్కపెల్లి లక్ష్మణ్.. పర్లపెల్లి కనుకయ్య.. నాంపల్లి రాజేందర్.. ఇల్లందుల హరీశ్.. బత్తుల రాజేశ్& వీరంతా కొద్ది నెలల క్రితం వరకు దినసరి కూలీలు. ఇప్పుడు ఎల్కపల్లి లక్ష్మణ్ హార్వెస్టర్ యజమాని! అతని సంపాదన రోజుకు రూ.10 వేల పైమాటే! మరో ఇద్దరికి ఉపాధి చూపిస్తున్నాడు. బిడ్డ పెండ్లికి చేసిన అప్పు ఎట్లా తీర్చాలో అర్థంకాక నిన్న మొన్నటి దాకా తల్లడిల్లిన పర్లపెల్లి కనుకయ్య ఇప్పుడు పాల వ్యాపారి. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.20 వేలు కూడబెడుతున్నాడు.
నాలుగు నెలల క్రితం వరకు అడ్డా మీద కూలీగా బతుకు వెళ్లదీసిన నాంపల్లి రాజేందర్ ఇప్పుడు రూ.4 లక్షల చిట్టీ కడుతున్నానని సగర్వంగా చెప్తున్నాడు. సిమెంట్, కంకర కలిపే మిషన్ ఆపరేటర్గా ఎక్కడెక్కడో తిరిగి, అష్టకష్టాలు పడ్డ ఇల్లందుల హరీశ్.. తాజాగా ప్రారంభించిన పాల వ్యాపారాన్ని విస్తరించే వ్యూహాల్లో నిమగ్నమయ్యాడు. ఆరు నెలల క్రితం వరకు కేవలం రూ.20 వేల జీతంతో సేల్స్మెన్గా పనిచేసిన బత్తుల రాజేశ్ ఇప్పుడు రూ.లక్షల టర్నోవర్తో బిజినెస్ చేస్తున్నాడు. వీరి జీవితాల్లో వచ్చిన మార్పుకు ఏకైక కారణం దళితబంధు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దళితుల ఆర్థికాభివృద్ధికి, తద్వారా రాష్ట్రంలో సంపద సృష్టికి బాటలు వేస్తున్నదనడానికి ఈ ఐదుగురి జీవితాలు ఒక ఉదాహరణ మాత్రమే.
నాడు కూలీ .. నేడు డెయిరీ యజమాని
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరానికి చెందిన నాంపల్లి రాజేందర్ది నిరుపేద దళిత కుటుంబం. భార్య రాధిక, ఇద్దరు బిడ్డలు, కొడుకు ఉన్నారు. కూలీ పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. దళితబంధు కింద రూ.10 లక్షలు మంజూరు కాగా డెయిరీ యూనిట్ను ఎంచుకొన్నాడు. హర్యానా నుంచి బర్రెలను కొనుగోలు చేశాడు. పాల నాణ్యత బాగుండటంతో కరీంనగర్ విజయ డెయిరీ వాళ్లే స్వయంగా వచ్చి రోజుకు 20 లీటర్లు కొంటున్నారు. ఒక్కొక్క లీటర్కు రూ.70 చెల్లిస్తున్నారు. మరో నాలుగు లీటర్ల పాలను చుట్టుపక్కలవారికి విక్రయిస్తున్నారు. మొత్తంగా రోజుకు రూ.1,680 ఆదాయం వస్తున్నదని చెప్తున్నాడు. వచ్చిన డబ్బులతో రూ.4 లక్షల చిట్టీ వేస్తున్నట్టు తెలిపాడు. తమ బతుకును తీర్చిదిద్దిన కేసీఆర్ను జీవితంలో మరువనని చెప్తున్నాడు.
నాడు 20 వేల జీతం.. నేడు 20 లక్షల టర్నోవర్
బత్తుల వీరయ్య-ఉపేంద్రమ్మ దంపతులది యాదాద్రి భువనగిరి జిల్లాలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రి. వీరయ్య తాపీ మేస్త్రీగా పనిచేస్తే, ఉపేంద్రమ్మ దినసరి కూలీగా పనిచేసేది. కొడుకు రాజేశ్ను ఇంటర్ వరకు చదివించి, ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదువు మానిపించారు. 2014లో ఐటీఐ-ఎలక్ట్రీషియన్ కోర్సులో చేరిన రాజేశ్ రూ.లక్షన్నర ఫీజు చెల్లించలేక మానేశాడు. భువనగిరిలోని ఒక దుకాణంలో సేల్స్మెన్గా నెలకు రూ.10 వేల జీతంతో చేరాడు. ఏడేండ్లు పనిచేసినా నెల జీతం రూ.20 వేలు దాటలేదు. ఈ నేపథ్యంలో ఉపేంద్రమ్మకు దళితబంధు కింద రూ.10 లక్షల సాయం అందింది. దీంతో భువనగిరిలో హోల్సేల్ వ్యాపారం ప్రారంభించింది ఈ కుటుంబం. ప్రస్తుతం రాజేశ్ దుకాణం నిర్వహణ బాధ్యతలు చూస్తూ, సబ్ డీలర్గా వ్యవహరిస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు దుకాణాలకు కిరాణా సరుకులు సరఫరా చేస్తున్నాడు. ఆరు నెలల్లోనే టర్నోవర్ రూ.20 లక్షలు దాటింది. నెలకు దాదాపు రూ.లక్ష కమీషన్ వస్తున్నట్టు రాజేశ్ చెప్తున్నాడు. దుకాణంలో మరో ఐదుగురికి ఉపాధి చూపిస్తున్నాడు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.30 వేలకు పైగా మిగులుతున్నాయని సంతోషం వ్యక్తంచేశాడు.
కలలో కూడా అనుకోలే
కూలీనాలీ జేసుకుని బతికే మాలాంటోళ్లకు ఇలా.. మంచి రోజులు వస్తాయని కలలో కూడా అనుకోలే. పది పైసలు అప్పు పుట్టని ఈ రోజుల్లో రూ.పది లక్షలు ఇచ్చుడంటే మాటలా. షాపు పెట్టినాక నా కొడుకు నిమ్మలమైండు. సీఎం కేసీఆర్ మా కుటుంబానికి దారి చూపిన దేవుడు.
–బత్తుల ఉపేంద్రమ్మ, దళితబంధు లబ్ధిదారు, వాసాలమర్రి
పాలమ్ముతూ నెలకు 20 వేల సంపాదన
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన పర్లపెల్లి కనుకయ్యకు 20 గుంటల భూమి ఉన్నది. భార్య లక్ష్మి దివ్యాంగురాలు. కొడుకు శ్రీనివాస్, కూతురు సంధ్య ఉన్నారు. కనుకయ్య కూలీ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అప్పుచేసి కూతురు పెండ్లి చేశాడు. అప్పు ఎలా తీర్చాలో అర్థంకాని పరిస్థితి. దళితబంధు పథకం అతనికో దారి చూపింది. డెయిరీ యూనిట్కు దరఖాస్తు చేశాడు. రూ.1.50 లక్షలతో షెడ్డు నిర్మించాడు. రూ.3 లక్షలతో నాలుగు బర్రెలు కొనుగోలుచేశాడు. ఆరు నెలలుగా రోజుకు 20 లీటర్లు చొప్పున పాలు అమ్ముతున్నాడు. ఖర్చులు పోను నెలకు సుమారు రూ.20 వేలు సంపాదిస్తున్నాడు.
నలుగురికి పని కల్పిస్తున్నా
చిన్నప్పటి నుంచి సెంట్రింగ్ కూలీగా పనిచేస్తున్నా. రోజూ హైదరాబాద్కు పోవుడు రావుడు ఇబ్బందిగా ఉండేది. నా సంపాదనతో ఇల్లు గడవడం కష్టం ఉండెడిది. దళితబంధు డబ్బులు రూ.7.50 లక్షలతో సెంట్రింగ్ సామాను కొన్నా. గిప్పుడు ఊర్లోనే బిల్డింగ్లకు సెంట్రింగ్ బిగిస్తున్నా. నెలకు రూ.యాభై వేల వరకు మిగుల్తున్నాయి. మరో నలుగురికి పని కల్పిస్తున్నా. నా భార్య కవిత రూ.2 లక్షలు పెట్టి దీపం ఒత్తులు తయారు చేసే మిషన్ కొన్నది. నెలకు రూ.20 వేల వరకు సంపాదిస్తున్నది. దళితబంధు డబ్బులు రాకుంటే రోడ్డున పడే పరిస్థితి మాది. ఈ మధ్యనే బైక్ కూడా కొనుక్కొన్నా. ఇదంతా సీఎం కేసీఆర్ సారు దయ.
-బొల్లారం ఆనంద్, వాసాలమర్రి
పని కోసం వందల కిలోమీటర్లు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన ఇల్లందుల హరీశ్-శైలజ దంపతులకు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు తప్ప ఇతర ఆస్తులు లేవు. అజాక్స్ (సిమెంట్, కంకర కలిపే మిషన్) ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని వెళ్లదీసేవాడు. ఆ పని చేయడానికి వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. హరీశ్ జీవితంలో దళితబంధు కొత్త వెలుగులు నింపింది. దళితబంధు ద్వారా రూ.10 లక్షలు రాగా రూ. 5.50 లక్షలతో డెయిరీని ప్రారంభించాడు. రూ.4 లక్షలతో నాలుగు బర్రెలు కొనుగోలు చేశాడు. రూ.1.50 లక్షలతో రేకుల షెడ్డు నిర్మించాడు. మొదట్లో నాలుగు బర్రెలు కలిపి రోజుకు 42 లీటర్ల పాలు ఇచ్చేవి. తొలి నాలుగు నెలల పాటు నెలకు సగటున రూ.50 వేల ఆదాయం వచ్చిన్నట్టు తెలిపాడు. ఇప్పటివరకు రూ.2,60,00 సంపాదించాడు. ఇందులో రూ. 80 వేలు ఖర్చులు పోగా రూ.1,80,000 నికర ఆదాయం లభించిందని వివరించాడు. గత రెండు నెలల నుంచి సగటున నెలకు రూ.30 వేల ఆదాయం వస్తున్నదని చెప్తున్నాడు. మరో మూడు బర్రెలు కొనుగోలు చేసి, షెడ్డును విస్తరించాలన్న ఆలోచనతో ఉన్నాడు. దీంతో ఆదాయం మరింత పెరగనున్నది.
ఫ్యాక్టరీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయ్
హైదరాబాద్ చర్లపల్లిలోని ఫ్యాక్టరీలో వెల్డర్గా పనిచేసేవాడిని. దళితబంధు డబ్బులతో ఊర్లోనే వెల్డింగ్షాప్ పెట్టినా. ఏసీ, డీసీ, ఆక్సిజన్, గ్యాస్ కట్టర్ సామగ్రిని కొనుక్కున్నా. చర్లపల్లిలో పనిచేస్తే అన్ని ఖర్చులు పోను నెలకు ఐదారు వేలు మిగులుతుండె. గిప్పుడు నెలకు రూ.యాభై వేల వరకు సంపాదిస్తున్నా. చుట్టుపక్కల ఫ్యాక్టరీల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నయ్. ఊర్లో త్రీఫేజ్ కరెంటు ఉంటే సంపాదన రూ.లక్షకు పైనే ఉండెడిది. మరో ముగ్గురు, నలుగురికి కూడా పని కల్పించేటోడిని. ఏదిఏమైనా సీఎం కేసీఆర్ దయతోనే కొత్త జీవితం మొదలుపెట్టిన.
– కొండాపురం నగేశ్, వాసాలమర్రి
తినేందుకు కూడా టైం సరిపోతలేదు
మాది కమలాపూర్. చిన్నప్పటి నుంచి పార పనికి పోయెటోన్ని. డప్పు కొట్టెటోన్ని. పదేండ్లుగా సెంట్రింగ్ పనికి పోయిన. 8 నెలల క్రితం దళితబంధు పైసలతో సెంట్రింగ్ సామాన్ కొనుకున్నా. ఇప్పుడు నా కొడుకు కిశోర్తో కలిసి బిల్డింగ్లకు సెంట్రింగ్ పనిచేస్తున్నా. ఇప్పటివరకు 15 బిల్డింగ్లకు సెంట్రింగ్ కొట్టా. మరో ఆరుగురికి పని ఇస్తున్నా. చేతి నిండా పని ఉన్నది. అన్నం తినేందుకు కూడా టైం సరిపోతలేదు. బిల్డింగ్ పూర్తి కాకముందే శనిగరంలో మరో ఆర్డర్ వచ్చింది. ఇప్పటివరకు రూ.2 లక్షలు నిల్వకు వచ్చినయి. వాటితో తక్కువ పడ్డ సామాను కొనుక్కొంటున్నా. అధికారులు ఎప్పటికప్పుడు పనులు చేస్తున్ననో లేదో అడుగుతున్నరు. అంతా కేసీఆర్ సారు దయ.
– మాట్ల సుభాశ్, కమలాపూర్, హనుమకొండ
రోజుకు 15వేలు మిగులుతున్నయి
నా పేరు నాగరాజు. మాది హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామం. నేను ఎనిమిదేండ్లు హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేసిన. ఈ అనుభవంతో మా పెద్దనాన్న కొమురయ్య, మా తమ్ముడు నటరాజ్, నేను కలిసి దళితబంధు పథకంలో ట్రాక్ (చైన్) హార్వెస్టర్ కొనుక్కొన్నం. వరి కోతల సీజన్లో గిరాకీ బాగుంది. వరి కోతల కోసం రైతులు ఫోన్లు చేసి పిలుస్తున్నరు. డ్రైవర్ అవసరం లేకుండా నేను, తమ్ముడు నడుపుకొంటున్నాం. రోజుకు 9 గంటలు వరి కోస్తున్నం. ఖర్చులు పోను రోజు పదిహేను వేల రూపాయలు మిగులుతున్నాయి. దళితబందు పథకం పెట్టి వరికోత యంత్రం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్సార్ రుణం తీర్చుకోలేనిది. ఏండ్ల తరబడి డ్రైవర్గా పనిచేసిన నన్ను ఓనర్గా మార్చిన దేవుడు కేసీఆర్సార్.
–మొండెద్దుల నాగరాజు, ఉప్పల్, కమలాపూర్, హనుమకొండ
రోజుకు 10 వేలపైనే ఆదాయం
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన ఎల్కపెల్లి లక్ష్మణ్ది నిరుపేద కుటుంబం. గతంలో భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు కూడా కూలీ పనిచేసేవారు. కొన్నాళ్ల క్రితం లక్ష్మణ్ ఒక ఆసామి వద్ద అప్పుచేసి ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. వచ్చిన ఆదాయం నుంచి అప్పు తీరుస్తూ, మిగిలిన పైసలతో కుటుంబాన్ని పోషించేవాడు. పిల్లలను చదివించి, వివాహాలు చేశాడు. ఎవరైనా ఆర్థికంగా అండగా నిలిస్తే పెద్ద వాహనం కొనుక్కోవాలని ఆశ పడ్డాడు. దళితబంధు పథకం కింద హార్వెస్టర్ యూనిట్ను ఎంపిక చేసుకొన్నాడు. వాహనం విలువ రూ.24 లక్షలు. దీంతో కొడుకు కిరణ్కుమార్, తాను కలిసి సమష్టి యూనిట్ను ఎంపిక చేసుకొన్నారు. దళితబంధు ద్వారా వచ్చిన రూ.20 లక్షలకు తోడు, మరో రూ.4 లక్షలు జోడించి యూనిట్ను తీసుకొన్నారు. తొలుత మహారాష్ట్రలోని సోలాపూర్, పూణే ప్రాంతాల్లో మంచిశనగ, గోధుమ పంటల కోతలకు వెళ్లి, ఖర్చులన్నీ పోను రోజుకు రూ.10 నుంచి రూ.12 వేలు సంపాదించాడు. తెలంగాణలో కోతలు మొదలైన తరువాత తిరిగొచ్చిన లక్ష్మణ్.. ఇదంతా కేసీఆర్ చలువేనని, బతుకంతా రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపాడు. ఇప్పుడతను హార్వెస్టర్ నడిపేందుకు డ్రైవర్, క్లీనర్ను పెట్టుకొని మరో ఇద్దరికి ఉపాధి చూపిస్తున్నాడు.
దళితబంధుతో సంపద సృష్టించాలి
దళితబంధు పథకం ద్వారా మెరుగైన, లాభదాయకమైన, ఇష్టమైన వృత్తిని ఉపాధి యూనిట్గా ఎంచుకోవాలి. ప్రభుత్వం అందజేస్తున్న రూ.10 లక్షలను రెట్టింపు చేయాలి. సంపద సృష్టించాలి. ఆర్థికాభివృద్ధిని సాధించాలి. ఇదే సీఎం కేసీఆర్ సంకల్పం. స్వప్నం. వాటిని నెరవేర్చేందుకు లబ్ధిదారులు, అధికారులు కృషి చేయాలి.
–కొప్పుల ఈశ్వర్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి
సీఎం ఆశయాన్ని నిలబెట్టాలి
దళితబంధు లబ్ధిదారులు అందరూ ఒకే రకం కాకుండా వేర్వేరు యూనిట్లను ఎంచుకోవాలి. తమకు ఆసక్తి ఉన్న, రాణించగల, గిట్టుబాటు అయ్యే ఉపాధి మార్గాలపై దృష్టి సారించాలి. అప్పుడే దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.
–బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్