వరంగల్, జూలై 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పెన్ను, పుస్తకం పట్టాల్సిన చేతులు.. పేదకరికంతో చెత్తను ఏరుకుంటున్నాయి. బడిలో గడవాల్సిన బాల్యం చెత్తకుప్పల్లో కరిగిపోతున్నది. ఆటాపాటలతో ఆనందంగా గడవాల్సిన ఆ పిల్లలు.. చదువుల తల్లికి దూరమయ్యారు. అలాంటి అభాగ్య పిల్లలకు.. కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అండగా నిలిచారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చెత్త సేకరిస్తున్న 11 మంది పిల్లలను, వారి తల్లిదండ్రులను ఒప్పించి చదువులమ్మ ఒడికి చేర్చారు. ప్రభుత్వ గురుకులాల్లో చేర్పించి.. వారికి అవసరమైన నోటు బుక్కులను, పెన్నులను అందజేశారు.
మంగళవారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఈ 11 మంది పిల్లలు, వారి తల్లితండ్రులతో కలిసి భోజనం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో పేద పిల్లలకు ఉచితంగా కేజీ టు పీజీ విద్య అందుతున్నదని చెప్పారు. ఆర్థిక స్థోమత లేని కుటుంబాలు ప్రభుత్వ గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురుకులంలో చదువుకునే ఒక్కొక్కరిపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నదని వివరించారు. బాల్యం బడిలోనే గడవాలని, వారితో పని చేయించవద్దని తెలిపారు. చెత్త ఏరుకునే బాలలను గుర్తించి, వారిని బడిలో చేర్పించడంలో సహకరించిన లక్ష్మిని, అడ్మిషన్ల ప్రక్రియలో సహకరించిన మైనారిటీ శాఖ ఈడీ శ్రీనివాస్ను వినయ్భాస్కర్ అభినందించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చెత్త ఏరుకునే పిల్లలను ఎమ్మెల్యే వినయ్భాస్కర్ ఏటా ఇలాగే ప్రభుత్వ గురుకులాలు, స్కూళ్లలో చేర్పిస్తున్నారు.
మంచిగ చదువుకుంటా..
నా తోటి వాళ్లు అందరూ స్కూల్కు పోతరు. నాక్కూడా పోవాలని ఉండేది. రోజు చెత్త తెచ్చి అందులోని వస్తువులు అమ్ముకునేది. సారు గురుకులంలో చేర్పించిండు. అక్కడే తిండి ఉంటదంట. అక్కడికే పోత. మంచిగ చదువుకుంట.
-రాకేశ్, బాలకార్మికుడు
గురుకులానికి పోతా
రోజు పనిచేసి వచ్చినంకనే తినుడు ఉండేది. సారు చేర్పించిన బడిల సదువు, తిండి ఉంటందంట. అక్కడే ఉండాల్నని మా పెద్దోళ్లు చెప్పిండ్లు. గురుకులానికి పోయి అక్కడే ఉంట.
-గాయత్రి
వినయన్న స్ఫూర్తి
నాలాంటి రాగ్ పికర్స్ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే వినయన్న అండగా ఉంటున్నరు. మా పిల్లలు చదువుకు దూరంగా ఉంటున్నరు. ప్రతి సంవత్సరం వినయన్న గుర్తించి పిల్లలను బడిలో, హాస్టళ్లలో చేర్పిస్తున్నరు. ఇలాగే నన్ను చేర్పించిండు. డిగ్రీ పూర్తి చేసిన. పీజీ చేస్తున్న. ఎస్సై, కానిస్టేబుల్ జాబ్ కోసం ఎగ్జామ్ రాసిన. వినయన్న అండతో మాలాంటి వాళ్లు ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం వచ్చింది.
-పత్రి లక్ష్మి