రాజన్న సిరిసిల్ల, మార్చి 9: ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంపై సిరిసిల్ల నేత కార్మికులు హర్షం వ్యక్తంచేశారు. బుధవారం వారు రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు. పట్టణంలో భారీ కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. నేతన్న విగ్రహం వద్ద పటాకులు కాల్చారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. నేత కార్మికులకు బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగ దుస్తులు, యూనిఫారాల అర్డర్లిచ్చిన సర్కారుకు అండగా ఉంటామని చెప్పారు. తమ బతుకులు మార్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.