హైదరాబాద్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ): ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ హ్యాండ్లూమ్ కోసం కృషి చేయాలని కేంద్రాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రతిపాదనలు పంపాలని ప్రధాని మోదీకి బుధవారం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న బహిరంగ లేఖ రాశారు.
ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ (ఐవైఎం)గా ప్రకటించినట్టుగానే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ హ్యాండ్లూమ్ కోసం కృషి చేయాలని కోరారు. భారతదేశం గొప్ప సాంసృతిక వారసత్వమని, సంప్రదాయాల్లో చేనేత అంతర్భాగమని, ఈ నేపథ్యంలో చేనేతకు విశేష గుర్తింపును తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ చేనేత సంవత్సరం ప్రకటిస్తే అది చేనేత కార్మికుల నైపుణ్యం, సంప్రదాయ వస్త్రాల సంరక్షణ, ప్రపంచ వేదికపై ప్రదర్శనకు, ప్రచారానికి ఎంతో దోహదపడుతుందని లేఖలో పేర్కొన్నారు.