Telangana | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వక, బకాయిలు విడుదల చేయక సర్కారు సాంచాలకు సంకెళ్లు విధించింది. పనులు లేక ఉపాధి కోల్పోయిన నేతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఫలితంగా అనుబంధ పరిశ్రమల యజమానులు, కార్మికుల ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఎసీ) పోరుబాటకు సిద్ధమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు వందలాది గొంతుకలు ఏకమయ్యాయి. శనివారం సిరిసిల్లలో పెద్ద ఎత్తున నేతన్న గర్జన పేరిట భారీ సభ నిర్వహిస్తున్నది.
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. పనిలేక పస్తులుండి దాదాపు ఏడు వందల మంది నేతన్నల ఆకలిచావులు, బలవన్మరణాలతో సిరిసిల్ల ఉరిశాలగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి స్వయంగా సిరిసిల్లను సందర్శించి ఆదుకుంటానని ఇచ్చిన మాట నెరవేర్చలేదు. ఆత్మహత్యలు, ఆకలి చావులకు పాల్పడ్డ కుటుంబాలకు పరామర్శలే తప్ప న్యాయం జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ముందుకొచ్చి తామున్నామంటూ వారి బతుకులకు భరోసా ఇచ్చారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది.
చేనేత, మరమగ్గాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించింది. మరమగ్గాలను యూనిట్లుగా చేసి మ్యాక్స్ సంఘాలు, ఎస్ఎస్ఐ యూనిట్లను ఏర్పాటు చేసింది. చేనేత జౌళి శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన వస్త్ర పరిశ్రమకు చేయూతనిచ్చి పునర్జీవం పోసింది. కోటి బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్, ఆర్వీఎం వస్త్ర ఉత్పత్తులతో నేతన్నకు చేతినిండా పని, పనికి తగ్గట్టు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వేతనం సంపాదించేలా చర్యలు తీసుకున్నది. నూలు, విద్యుత్తు సబ్సిడీకి రూ.వేల కోట్లు ఇచ్చి ఇటు యజమానులకు, అటు ఆసాములకు, కార్మికులకు అండగా నిలిచింది. వస్త్ర ఉత్పత్తుల విఫణీలో పోటీని తట్టుకునేలా తిరుపూర్, సూరత్, నాగపూర్, ఇచ్చల్ కరంజీ లాంటి నగరాలకు యజమానులు, ఆసాములను స్టడీ టూర్కు ప్రభుత్వం సొంత నిధులతో పంపించింది. కార్మికుడినే యజమానిని చేయాలన్న ఉద్దేశంతో ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 65 ఎకరాల్లో షెడ్లు కూడా నిర్మించింది. నేతన్నలకు 50 ఏండ్లు వచ్చేసరికి నెలకు రూ.2,016 ఇచ్చి ఆసరాగా నిలిచింది.
పదేండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభం తిరిగి ఆ పార్టీ అధికారంలోకి రాగానే పునరావృతమైంది. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో నడిచిన మరమగ్గం మళ్లీ మూగబోయింది. కార్మికులపై కాంగ్రెస్ కక్షగట్టింది. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లను ఇవ్వకుండా తొక్కిపెట్టింది. పెండింగ్లో ఉన్న రూ.290 కోట్లు విడుదల చేయకుండా యజమానులు, ఆసాముల ఉసురు పోసుకుంటున్నది. ప్రభుత్వం నిధులు, వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇస్తే తప్ప పరిశ్రమ నడపలేమంటూ ఉత్పత్తిదారులు చేతులెత్తేశారు.
మాది సిరిసిల్లలోని బీవైనగర్. చిన్నప్పటి నుంచి సాంచాల పనిజేత్తున్న. పదేండ్లు బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు సాంచాలు మంచిగ నడిచినయ్. కేసీఆర్ సారు ఇచ్చిన బతుకమ్మ చీరలు నడిపి రెండు పూటలా కడుపునిండా తిన్నం. కొత్త సర్కారు వచ్చి వంద రోజులన్న కాలే దరిద్రం జుట్టుకున్నది. పదేండ్ల కింద కాంగ్రెస్సే ఉండె. అప్పుడు సంక్షోభం అన్నరు. ఇప్పుడు మళ్ల గదే చెపుతుండ్రు. ఇక్కడ కేటీఆర్ ఉన్నడని కక్షగట్టి కార్మికులను గోసపుచ్చుకుంటున్నరు. కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్.. ఇది ఉన్నన్ని రోజులు మా కడుపులు ఎండుడే. ఎంత మందిని ఉరిబెట్టి సంపుద్దో?
– మహేశుని రమేశ్, నేత కార్మికుడు, సిరిసిల్ల
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు మరమగ్గానికి మరణ శాసనంగా మారుతున్నాయి. ప్రభుత్వం నిధులివ్వకుండా ఇ బ్బంది పెడుతున్నది. యజమానులు మరమగ్గాలను బంద్ పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వ పథకాలను కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం రూ. 290 కోట్ల బకాయిలు చెల్లించి, కొత్త ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పించాలి.
– మూషం రమేశ్, తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు