పోచమ్మమైదాన్, మే 22 : తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసిన నేత ఉత్పత్తుల బకాయిలను చెల్లించడం లేదు. నేత కార్పెట్లకు రావాల్సిన కోట్లాది రూపాయలను విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి బకాయిలు అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని ఆయా సంఘాల అధ్యక్షులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బకాయిల కోసం వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రతి రెండు, మూడు నెలలకోసారి విజయవాడకు వెళ్లి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు. అదే ఆంధ్రాలో తయారు చేసిన చేనేత ఉత్పత్తులకు బకాయిలు చెల్లించిన ఆంధ్రా అధికారులు.. తెలంగాణ చేనేత సంఘాలపై వివక్ష చూపుతున్నారని ఫైర్ అవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చేనేత ఉత్పత్తులకు నిలయమైన ఓరుగల్లులో తయారు చేసిన కార్పెట్లు, బెడ్షీట్లకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆప్కో ద్వారా కార్పెట్లు కొనుగోలు చేసి..
ఏపీలోని ప్రభుత్వ హాస్టళ్లల్లో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2021, మే 2022 సంవత్సరాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలో కూడా ఆప్కో ద్వారా నేత ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 23 చేనేత సహకార సంఘాలు, కరీంనగర్ జిల్లాలోని 3 చేనేత సహకార సంఘాల నుంచి రూ.4 కోట్ల 60 లక్షల విలువైన కార్పెట్లను కొనుగోలు చేసింది. మహబూబ్నగర్ జిల్లాలో రూ.2 కోట్ల 50 లక్షల విలువైన బ్లాంకెట్లను కొనుగోలు చేశారు. మూడు నెలల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పి కార్పెట్లను తీసుకెళ్లిన అధికారులు.. ఏడాదిన్నర కావొస్తున్నా చెల్లించడం లేదు. కోట్లాది రూపాయలు ఒక చోట పోగుబడితే తామెలా వ్యాపారం చేయాలని ఆయా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రా అధికారుల తీరు వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సంఘాలను అభివృద్ధి చేయలేక, కార్మికులకు చేతినిండా పని కల్పించలేక సతమతమవుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ చేనేత సంఘాలకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని పలు సంఘాల అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు.
మూడు నెలలకే ఇస్తామన్నారు
మూడు నెలలకే బకాయిలు ఇస్తామని ఉత్పత్తులు తీసుకెళ్లి.. ఏడాదిన్నర కావొస్తున్నా ఇంతవరకు చెల్లించడం లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొనుగోలు చేసిన చేనేత ఉత్పత్తులకు బకాయిలు చెల్లించారు. తెలంగాణ చేనేత సంఘాలపై మాత్రం వివక్ష చూపుతూ బకాయిలు చెల్లించకుండా కాళ్లకు చెప్పులు అరిగేలా తిప్పుకుంటున్నారు. టెస్కోతో పాటు ఆప్కో ద్వారా కొనుగోళ్లు పెరిగితే సంఘాలు ఆర్థికంగా బలపడుతాయని భావిస్తే.. బకాయిలు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నాం.
-అడిగొప్పుల సంపత్, విశాలాక్షి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు
బెజవాడకు వెళ్లి నిరాశతో వచ్చాం
ఒక్కో సంఘానికి కోట్లాది రూపాయల చొప్పున బకాయిలు రావాల్సి ఉంది. ఆప్కో అధికారులను కలవడానికి పలుమార్లు విజయవాడకు వెళ్లి నిరాశతో తిరిగి వచ్చాం. ప్రతి మూడు నెలలకోసారి ఎనిమిది సంఘాల అధ్యక్షులం కలిసి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ బకాయిల కోసం తిరుగుతున్నాం. చివరికి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీతను కూడా కలిసి మా గోడు చెప్పాం. గతంలో వరంగల్లో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం అక్కడ ఆప్కోకు ఎండీగా ఉన్నప్పటికీ మా సమస్య పరిష్కారం కావడం లేదు.
– యెలుగం సాంబయ్య, షతరంజి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు