KRMB | గద్వాల, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాకనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను అప్పగించడాన్ని నిరసిస్తూ శనివారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై రైతులతో కలిసి ఎమ్మెల్యే బండ్ల ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసమర్థ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కృష్ణా జలాల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రభు త్వం 15 ఔట్లెట్స్ను కేఆర్ఎంబీకి అప్పగించకపోతే వాటి నిర్వహణకు సిబ్బంది, నిధులు కావాలని బోర్డు చైర్మన్ ఎందుకు అడిగారని ప్రశ్నించారు. మా యమాటలతో ప్రజలను నమ్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
కృష్ణా నదీ జలాల పంపిణీ అంశం ట్రిబ్యునల్ వద్ద తేలకముందే కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంతో రేవంత్రెడ్డి ప్రధాని మోదీకి దాసోహమైనట్టు స్పష్టమవుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టుల ఔట్లెట్స్ని ఈఎన్సీ బోర్డుకు అప్పగించారనే విషయం బోర్డు సమావేశ మినిట్స్ ద్వారా వెల్లడవుతున్నదని చెప్పారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని నిలదీశారు. తెలంగాణకు ప్రాణప్రదమైన కృష్ణా జలాల హక్కులపై ఇంత వివాదం జరుగుతుంటే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నాడని ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు వరద జలాల్లో 40 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వృధాగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ధర్నాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.