నల్లగొండ, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణప్రతినిధి) : ప్రధాని మోదీ పచ్చి అబద్ధ్దాల కోరని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లోపల, బయట కలిపి ఇప్పటికే ఎనిమిది సార్లు తెలంగాణ ఏర్పాటుపై అక్కసును వెళ్లగక్కారని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడ రక్తం ఏరులై పారిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో జరిగిన రక్తపుటేరులను మర్చిపోలేక దాన్ని తెలంగాణ ఏర్పాటుకు ఆపాదిస్తుండొచ్చని పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి గుత్తా మీడియాతో మాట్లాడారు. వాజపేయి హయాంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించిన బీజేపీ అప్పట్లో చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గింది నిజం కాదా అని ప్రశ్నించారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల ఏర్పాటు సమయంలోనే తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదని అన్నారు. కాంగ్రెస్తోపాటు బీజేపీ తెలంగాణకు తీరని ద్రోహం చేశాయని, కేసీఆర్ అలుపెరగని పోరాట ఫలితంగానే ప్రత్యేక రాష్ర్టాన్ని ఇవ్వక తప్పలేదని తెలిపారు. చరిత్రను వక్రీకరించే విధంగా మోదీ పదేపదే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆయన గౌరవానికి మంచిది కాదని చెప్పారు.
కాంగ్రెస్వి ఆచరణ సాధ్యం కానీ హామీలు
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్లు ఆచరణ సాధ్యం కానివని, కేవలం అధికారం కోసమే ప్రజలను మోసం చేసేలా హామీల ప్రకటన ఉన్నదని గుత్తా అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో వీటిని అమలు చేసి చూపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పథకాలను కాపీ కొడుతూ వాటికి అటూ ఇటూగా కొంత జోడిస్తూ ఆరు పథకాలను ప్రకటించారని విమర్శించారు.