మిర్యాలగూడ, ఏప్రిల్ 2 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారనున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు.
దేశాన్ని సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు పాలిస్తున్నాయని, ఇది దేశ మనుగడకు ప్రమాదకరమని హెచ్చరించారు. పార్లమెంటరీ వ్యవస్థకు విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల హక్కులను జీఎస్టీ పేరుతో హరించివేస్తున్నదని, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ రాష్ర్టాల అభివృద్ధికి అడ్డం పడుతున్నదని ధ్వజమెత్తారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని కేంద్రమే ప్రకటించిందని, అభివృద్ధిలోనూ ముందంజలో ఉన్నామ ని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగానే తెలంగాణ హక్కులను హరించి వేస్తున్నదని మండిపడ్డారు. విభజన హామీలను అమలు చేయకుం డా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం తీరు పట్ల సీఎం కేసీఆర్ బలంగా కొట్లాడుతున్నారని, దీనికి అన్ని పక్షాలు కలిసి రావాలని కోరారు. భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు కలిసే అవకాశం ఉన్నదని తెలిపారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. ఇప్పటికే 1.36 లక్షల ఉద్యోగాలను కల్పించడం జరిగిందని, మరో 80 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికమని అన్నారు.