నల్లగొండ: జాతీయ పార్టీల నేతలంగా తెలంగాణపై కన్నేశారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కేంద్ర నాయకత్వం దండయాత్ర చేస్తున్నదని విమర్శించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రంపై కేంద్రం విషం చిమ్ముతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణను చిన్నాభిన్నం చేయాలనేది బీజేపీ ప్రయత్నమన్నారు. కులమతాల చిచ్చుతో లబ్ది పొందాలనుకోవడం మంచిది కాదని హితవుపలికారు. ప్రధాని కులాల కుమ్ములాటలు ప్రోత్సహించడం సరికాదన్నారు.
ఆచరణ సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మధ్యపెడుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారం ఇస్తే తెలంగాణ ఆగమవతుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.