నల్లగొండ, నవంబర్ 26: ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి చేసింది ఏమీ లేదని, ఇప్పటి వరకు రాష్ట్ర సంక్షేమాన్ని పట్టించుకోని ఆ పార్టీల జాతీయ నాయకులు అందరూ కలిసి సీఎం కేసీఆర్పై దండయాత్ర చేస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏండ్లుగా కేంద్రం తెలంగాణపై విషం చిమ్ముతున్నదని, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణపై అకసు వెళ్లగక్కుతున్న మోదీ.. ముందుగా రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధాని జాతీయ దృక్పథంతో ఉండాలి కానీ.. వర్గీకరణ, కులాలు, మతాల పేరుతో రాష్ట్రంలో కొత్త పంచాయితీలు పెట్టేలా ఉండకూడదని హితవుపలికారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు మొత్తం తెలంగాణపై దండయాత్ర చేస్తూ సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్టు దుయ్యబట్టారు. తనపై కూడా సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, దీని వెనుకాల కాంగ్రెస్ కుట్ర ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందని, ఇందుకు కారణమైన సీఎం కేసీఆర్కు రైతులంతా మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చారని, ఇక్కడ ఓటు అడిగే అర్హత ఒక్క బీఆర్ఎస్కు తప్ప మరేపార్టీకి లేదని స్పష్టం చేశారు. రైతు బంధుపై హైకోర్టు తీర్పు హర్షణీయమని, మంగళవారం నుంచి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ మాత్రమే విజన్ ఉన్న నాయకుడని, ప్రతిపక్షాలకు ఎలాంటి విజనూ లేదని ఎద్దేవా చేశారు. వారి విజన్ అధికారం, కుర్చీ కోసమేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు పోతున్నదని, ఆయనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. బ్యాంకుల్లో రుణమాఫీ, అదానీకి కాంట్రాక్టులు ఇప్పిస్తున్నది మోదీ కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆరోపణలు చేస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్టేనని చెప్పారు.