నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపర్చేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని, రాష్ర్టాన్ని కబ్జా చేసేందుకు సమైక్యవాదులు మరోసారి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హెచ్చరించారు. వారి కుతంత్రాలను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజలు మేల్కొనకపోతే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఇది సమైక్యవాదుల కుతంత్రం. ప్రశాంతంగా, పచ్చగా ఉన్న రాష్ర్టాన్ని అస్థిరపర్చేందుకు వారు ప్రయత్నిస్తున్నరు. అందుకోసం రకరకాల శక్తుల్ని రంగంలోకి దింపుతున్నరు. బండి సంజయ్, షర్మిల పాదయాత్రలు ఆ కుట్రలో భాగమే. చంద్రబాబు అనుచరుడు రేవంత్ తీరు అందులో భాగమే. గవర్నర్ వ్యవహారశైలి, ఈడీ-సీబీఐ దాడుల డ్రామా అందుకోసమే. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే పోరాడి సాధించుకున్న రాష్ట్రం తిరిగి సమైక్యవాదుల పాలవుతుంది’ అని గుత్తా హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని స్పష్టంచేశారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన గుత్తా.. అనంతరం ‘నమస్తే తెలంగాణ’కూ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వాటి నేపథ్యాలకు సంబంధించి సీనియర్ రాజకీయనేతగా అనేక విషయాలపై ఆయన కుండబద్ధలు కొట్టారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎలా ఉంది?
1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున ఎన్నో అరాచకాలు, హత్యలు, కర్ఫ్యూలు, తుపాకుల మో తలు, కబ్జా గ్యాంగులు, రౌడీల స్వైరవిహారం నిత్యకృత్యంగా ఉండేవి. 8 ఏండ్లలో అలాంటి వాటికి తావులేకుండా పోయింది. అన్నివర్గాల ప్రజలు సామరస్యంతో సహజీవనం సాగిస్తున్నా రు. ఆంధ్ర, తెలంగాణ భేదం లేదు. దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం వచ్చిన 30 లక్షల మందిని సైతం తెలంగాణ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నది. కానీ.. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నేతల వ్యవహారశైలి ఉండడం తీవ్ర విచారకరం.
తెలంగాణపై కేంద్రం వైఖరి ఎలా ఉంది?
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో సీఎం కేసీఆర్ కేంద్రంతో సఖ్యత కోసం ప్రయత్నించారు. కొత్త రాష్ట్రం అభివృద్ధికి ఆటంకాలు ఉండకూడదని కేంద్రానికి పూర్తిగా సహకరించారు. కానీ రాష్ర్టావిర్భావం నుంచే తెలంగాణపై మోదీకి, బీజేపీకి లోలోపల వ్యతిరేకత ఉన్నదనేది చాలాసార్లు స్పష్టమైంది. మోదీ ప్రధాని అయిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలోనే చంద్రబాబు కోసం ఏడు మండలాలను, సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని ఏకపక్షంగా ఏపీలో కలిపారు. తెలంగాణ సర్కారును సంప్రదించలేదు. ఆ ఏడు మండలాల ప్రజల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. బిడ్డను బతికించి, తల్లిని చంపారంటూ రాష్ట్ర విభజనపై స్వయంగా ప్రధాని మోదీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు కూడా రాష్ట్ర ఏర్పాటుపై అక్కసే కదా. అప్పటి నుంచే మోదీ అసలు స్వరూపం క్రమంగా బయటపడుతూ వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచీ తన అవసరాల కోసం తెలంగాణపై మోదీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతూనే ఉన్నది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా అందులో భాగమే.
8 ఏండ్లలో మోదీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉన్నది?
బీజేపీ వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలపై మోదీ సర్కార్ కుట్రలకు పాల్పడుతున్నది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నచోట ప్రభుత్వాలను చీల్చి లేదా కూల్చివేసి బీజేపీ దొడ్డిదారిన గద్దెనెక్కుతున్నది. ఇప్పటికి 8 రాష్ర్టాల్లో ఇలాగే చేసింది. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి భంగపడింది. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పట్టు దొరకడం లేదన్న అక్కసుతో తెలంగాణ, కేరళ, తమిళనాడులో రాజకీయంగా, ఆర్థికంగా అడ్డంకులు సృష్టిస్తున్నది. మోదీ సర్కారు వైఖరిపై కేసీఆర్ గొంతెత్తితే తట్టుకోలేకపోతున్నది. అన్నింటిలోనూ తెలంగాణపై వివక్షను ప్రదర్శిస్తున్నది. తెలంగాణను ఆర్థికంగా దిగ్బంధించాలని, కేసీఆర్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేస్తున్నది. సమైక్యవాదులను పోగేసి రాష్ట్రంలో అలజడులకు తెరలేపుతున్నది.
వారి వ్యక్తిగత దూషణలు, వాడుతున్నభాషపై మీ అభిప్రాయం!
ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడుతున్నాడంటే.. రాష్ట్ర అభివృద్ధి కోసమైనా లేదా ఆ పార్టీ విధానమైనా.. సిద్ధాంతమైనా ఉండాలి. ఇవేవీ లేకుండా బండి సంజయ్, రేవంత్, షర్మిల లాంటి వాళ్లు కేవలం వ్యక్తిగతంగా ఇష్టమొచ్చిన రీతిలో భాషను వాడుతూ రాజకీయాలను జుగుప్సాకరంగా మారుస్తున్నారు. విద్వేషవ్యాఖ్యలతో విషం చిమ్ముతున్నారు.
షర్మిల యాత్రను ఎలా చూడాలి?
పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన రాజశేఖర్రెడ్డి కూతురు షర్మిల. ఇప్పుడు బీజేపీ దత్త పుత్రికగా మారింది. ఇక్కడ పాదయాత్రలు చేయిస్తూ ఇష్టానుసారంగా కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని, తెలంగాణ ప్రజాప్రతినిధులను అవమానపర్చేలా మాట్లాడుతున్నది. అసలు ఆమెకు తెలంగాణలో ఏం పని? ఇక్కడ రాజన్నరాజ్యం తెస్తా అంటే ఏంటి? 24 గంటల కరెంటును 9 గంటలు చేస్తదా? 2016 పెన్షన్ను రూ.200 చేస్తదా? రైతుబంధును నిలిపేస్తదా? సాగునీటి ప్రాజెక్టులను శిలాఫలకాలకే పరిమితం చేస్తదా? తాగునీటి కోసం మహిళలు మళ్లీ నల్లాల వద్ద బిందెలతో బారులుదీరాలా? ఏ రంగంలో చూసుకున్నా రాజన్న రాజ్యానికీ, తెలంగాణలో కేసీఆర్ రాజ్యానికీ పోలికే లేదు. రాజన్న రాజ్యం అంటే తెలంగాణకు వ్యతిరేకం. అలాంటి రాజ్యం తెస్తాననడం అంటే రాష్ర్టాన్ని రద్దు చేయిస్తామనే. షర్మిల అవినీతిపై మాట్లాడటం మరీ విడ్డూరం. అధికారంలో ఉన్నప్పుడు భారీ అవినీతికి పాల్పడి, జైళ్లకు వెళ్లింది ఆమె కుటుంబ సభ్యులే.
మండలి చైర్మన్గా మీరు రాజకీయంగా ఇంతలా స్పందించవచ్చా?
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా.. టీఆర్ఎస్ బీఫాం పైనే ఎమ్మెల్సీని అయ్యా. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం మేరకే చైర్మన్ అయ్యా. అయినా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆవేదన కలుగుతున్నది. పోరాడి సాధించిన తెలంగాణ సమైక్యవాదుల పాలవుతుంటే, కేసీఆర్ను రాజకీయంగా తప్పించాలని కుట్ర జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేం కదా.
ప్రస్తుతం తెలంగాణ ప్రజల కర్తవ్యమేంటి?
జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలు గమనించాలి. చిన్న చిన్న విషయాలకు తాత్కాలికంగా కేసీఆర్పై కోపం పెంచుకుంటేనో, ఇంకోటో చేస్తే నష్టపోయేది తెలంగాణే. ఉద్యమాలతో, ఆత్మబలిదానాలతో సాధించుకున్న రాష్ట్రం ముందుకు పోవాలంటే ప్రజలు, మేధావులు, యువత, విద్యార్థిలోకం కేసీఆర్కు అండ గా నిలువాలి. బీజేపీ అండదండలతో సమైక్యవాదులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి. రాష్ట్ర సుస్థిరతను కాపాడుకుంటూ ప్రగతి కొనసాగేలా చూడాలి. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని గుర్తించుకోవాలి.
గవర్నర్ ధోరణి సరికాదు..
ఏడాదికాలంగా చూస్తే గవర్నర్ చర్యలు, ఈడీ, సీబీఐ దాడులు, ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఇలా ఎన్నో దుర్మార్గాలకు బీజేపీ సర్కార్ ఒడిగడుతున్నది. ప్రభుత్వపరంగా ఏదైనా ఉంటే గవర్నర్ స్పందించవచ్చు. ఆమె రాజకీయంగా మాట్లాడటం సరికాదు. ప్రభుత్వం పంపిన 7 బిల్లులను ఆమె ఆపేశారు. నచ్చకపోతే తిరిగి పంపవచ్చు. నాన్చే ధోరణి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ధోరణి సరికాదు. షర్మిల విషయంలో గవర్నర్ స్పందించడాన్ని ఎలా చూడాలి? రాష్ట్రంలోని రాజకీయాలు ఆమెకు అనవసరం కదా. ఇక ఈడీ, సీబీఐలను రాజకీయ అస్ర్తాలుగా మార్చేశారు. ప్రతిపక్షంలో ఉన్నవారి గొంతు నొక్కేందుకు వీటిని ప్రయోగిస్తున్నారు. కేవలం అనుమానాల మీదే కవితను ఇరికించాలని చూస్తున్నారు. నిజంగా తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి. శిక్షలు పడుతాయి, లేదంటే నిర్దోషులుగా వస్తారు. కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని ఇబ్బందుల పాల్జేయాలని, తెలంగాణ సర్కార్ను అస్థిర పర్చాలని చేస్తున్న కుట్రలో భాగమే ఈ సోదాలు.
సమైక్యవాదులను పోగు చేయడం అంటే?
సుస్థిర అభివృద్ధితో ముందుకు సాగుతున్న తెలంగాణ సర్కార్ను అస్థిరపరచడమే లక్ష్యం అన్నట్టుగా మోదీ, బీజేపీ వ్యవహారశైలి ఉన్నది. బీజేపీ రాష్ట్ర నేతలతోపాటు ఆ పార్టీ దత్త పుత్రిక షర్మిల, చంద్రబాబు అనుయాయి రేవంత్రెడ్డి నిత్యం ఏదోరకంగా అలజడులకు కారణమవుతున్నారు. వీరికి గవర్నర్ వ్యవహారశైలి తోడైంది. బండి సంజయ్కు తెలంగాణ ఉద్యమం గురించే తెల్వదు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలంగాణ కోసం పదవీ త్యాగం చేయమంటే పారిపోయిన వ్యక్తి. తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అయిన వైఎస్ రాజశేఖర్రెడ్డి కూతురు షర్మిల, కరడుగట్టిన సమైక్యవాది అయిన చంద్రబాబు మనిషి రేవంత్ అని మర్చిపోవద్దు. బీజేపీ స్క్రీన్ప్లేలో భాగంగానే రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. వీళ్లంతా కలిసి వేర్వేరుగా చేస్తున్న యాత్రలు, విద్వేషపూరిత ఉపన్యాసాలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగానే కదా. వీరంతా సమైక్యవాదుల పక్షాన తెలంగాణను అస్థిరపర్చేందుకే కదా పనిచేస్తున్నది. రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లు అవుతున్నా.. చంద్రబాబు సహా ఈ నాయకులందరికీ ఇంకా ఇక్కడే స్థిరనివాసం ఎందుకు? వారి పంచాయితీలను ఆంధ్రలో ఉండి తేల్చుకోవాలి కానీ, తెలంగాణ తెరువెందుకు? టీడీపీ అనో ఇంకోటి అనో.. తాము చెప్పినట్టల్లా ఆడే పావులను ఇతర పార్టీల్లోకి చొప్పించి వారికి నాయకత్వాన్ని అప్పగించి, వాళ్ల ద్వారా తిరిగి ఎప్పుడైనా సమస్య వస్తే మళ్లీ సమైక్యరాష్ట్రంగా చేయాలనే దుర్బుద్ధితోనే వాళ్లంతా వ్యవహరిస్తున్నారు. ఏదైనా సమయం, సందర్భం వస్తే తెలంగాణ రాష్టానికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా వ్యవహరించే పరిస్థితులను సృష్టిస్తున్నారు.
బండి సంజయ్ ఆరోపణలపై ఏమంటారు?
సంజయ్ మాటలకు తలాతోకా ఉండదు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు జప్తు చేస్తే రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై ఉన్న అప్పులన్నీ పోతాయంటాడు. అసలు బడ్జెట్పై ఏమైనా అవగాహన ఉందా? అసలు రాష్ట్ర బడ్జెట్ ఏంటి, జీతభత్యాలు ఏంటి, సంక్షేమ రంగం ఏంటి? అన్నింటికీ పోగా మిగిలేది ఎంత? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? దాంట్లో లక్షల కోట్లు తినేది ఎలా? ఇది భారత ప్రభుత్వం కాదు కదా.. రాఫెల్ విమానాల రేట్లను ఒకేసారి నాలుగింతలు పెంచుకోవడానికి, వేల కోట్లను ఒక్క సంస్థకే అప్పగించడానికి. ఇలా కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేసినట్టు చేస్తే ఇక్కడ కూడా ఆ అవకాశం ఉండేదేమో.