మొయినాబాద్ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గురుకులాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మొయినాబాద్లో ప్రవాస భారతీయులు భాస్కర్రావు, శ్యామల వారి సౌజన్యంతో శశిరావు ఫౌండేషన్ యూఎస్ఏ, టెక్సాస్ వారి ఆధ్వర్యంలో మండల పరిధిలోని తోలుకట్టా గ్రామంలో రూ.2 కోట్ల తో అత్యాధునికి హంగులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె ప్రారంభించారు.
ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా 11 వందల గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టి అందులో వెయ్యి పాఠశాలల్లో జూనియర్ కళాశాలలను ప్రారంభించామని చెప్పారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 80 డిగ్రీ కళాశాలలు, రెండు పీజీ , రెండు లా కళాశాలలను ప్రవేశపెట్టి ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. గురుకుల పాఠశాలలో చేరడానికి ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రవేశం పొందడానికి పోటీ పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించడం కోసం మన ఊరు-మన బడి కార్యక్రమం కింద రూ.7, 500ల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి విడతగా 9 వేల పాఠశాలల అభివృద్ధికి కేటాయించామని చెప్పారు. ఎక్కువ శాతం విద్యార్థులు ఉన్న పాఠశాలలను మొదటి విడతలో ఎంపిక చేసుకుని మన ఊరు-మన బడి కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్లు సైతం టీ షార్ట్ ద్వారా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు.
ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక వెబ్సైట్
ప్రవాస భారతీయుల కోస ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ను రూపొందించామని మంత్రి సబితా తెలిపారు. తమ స్వస్థలాల్లో పేద విద్యార్థుల విద్యను ప్రోత్సహించడానికి ఆసక్తి ఉన్న వారు వెబ్ సైట్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. విదేశాల్లో ఉన్న భాస్కర్రావు కుటుంబ సభ్యులు మాతృ దేశంలోనే పేద విద్యార్థుల విద్యను ప్రోత్సహించడానికి స్వచ్చంధంగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.