నల్లగొండ : ఎస్టీల రిజర్వేషన్లపై రాష్ట్రాలదే తుది నిర్ణయం అని బీజేపీ అంటున్నది. అదే నిజమైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాతపూర్వకంగా ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేసారు. ఎస్టీ రిజర్వేషన్లపై నల్లగొండలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్టీల జనాభా ప్రకారం పది శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు.
ఆ తీర్మానం తమ వద్దకు రాలేదని అసలు తీర్మానం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడటం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ ఎస్టీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉండి చెల్లప్ప కమిషన్ నివేదికకు అనుగుణంగా ఈ తీర్మానం చేయించిన విషయం 2017 లో అసెంబ్లీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు తెలియదా అని ప్రశ్నించారు. అది మరిచి ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై గిరిజనులను మోసం చేద్దామనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు.