హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశంలోని అనేక పెద్దరాష్ర్టాలను వెనక్కి నెట్టి ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఏటికేడు రాబడిని పెంచుకుంటూ మరింత ముందుకెళ్తున్నట్టు కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తాజా నివేదికలో మరోసారి రుజువైంది. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,59,862 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి 7 నెలల్లో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) రూ.1,33,174 కోట్ల రాబడి సాధించింది.
ఇది బడ్జెట్ అంచనాలో 51.25 శాతానికి సమానం. నిరుడు ఇదే సమయంలో రాష్ర్టానికి రూ.1,05,187 కోట్ల రాబడి వచ్చింది. దీనితో పోలిస్తే ఈసారి రాష్ట్ర రాబడి రూ.27,987 కోట్లు పెరిగింది. స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తొలి ఆర్థిక సంవత్సరం (2014-15)లో అక్టోబర్ వరకు వచ్చిన రాబడి రూ.22,300 కోట్లు మాత్రమే. అంటే.. గత పదేండ్లలో రాష్ట్ర రాబడి రూ.1,10,874 కోట్లు (దాదాపు 5 రెట్లు) పెరిగింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పటిష్ఠ ఆర్థిక ప్రణాళికతోనే ఇది సాధ్యమైంది. ఇంత భారీ వృద్ధిరేటు మరే రాష్ట్రంలోనూ నమోదు కాలేదు.
ప్రధాన వాటా జీఎస్టీదే
రాష్ట్ర రాబడిలో ప్రధాన వాటా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)దే. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపేణా రాష్ర్టానికి రూ.50,942 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా.. తొలి 7 నెలల్లో 52 శాతం (రూ.26,408 కోట్లు) వచ్చింది. నిరుడు ఇదే సమయానికి జీఎస్టీ ద్వారా రూ.23,493 కోట్లు వచ్చాయి. దీనితో పోలిస్తే ఈసారి జీఎస్టీ రాబడి రూ.2,915 కోట్లు పెరిగింది. దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టాక తొలి ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.16,429 కోట్లుగా ఉన్న రాష్ట్ర రాబడి గత ఐదేండ్లలో రూ.9,979 కోట్లు పెరిగింది.
తెలంగాణపై అదే కక్ష
తెలంగాణపై నరేంద్రమోదీ సర్కారు అదే కక్షసాధింపు ధోరణిని కొనసాగిస్తున్నది. ప్రతిఏటా వలే ఈసారి ఆర్థిక వివక్షను చూపుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపేణా మొత్తం రూ.41,259 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. అక్టోబర్ వరకు మోదీ సర్కారు విదిల్చింది రూ.3,835 కోట్లు (9 శాతం) మాత్రమే. గ్రాంట్-ఇన్-ఎయిడ్ విషయంలో కేంద్రం ఏటా ఇలాగే వ్యవహరిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.41,001 కోట్ల గ్రాంట్-ఇన్-ఎయిడ్ వస్తుందని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేయగా.. అక్టోబర్ వరకు కేంద్రం రూ.5,592 కోట్లు మాత్రమే ఇచ్చింది.
దీనితో పోల్చినా ఈసారి రాష్ర్టానికి రూ.1,757 కోట్ల గ్రాంట్ తక్కువగా వచ్చింది. ఆర్థిక రంగంలో తెలంగాణ అనూహ్య వృద్ధి సాధించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న మోదీ సర్కారు రాజ్యాంగ బద్ధంగా రాష్ర్టానికి రావాల్సిన నిధులను సైతం ఇవ్వకుండా వేధిస్తున్నది. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రలకు అంచనాలకు మించి గ్రాంట్ ఇస్తూ.. తెలంగాణపై మాత్రం వివక్ష చూపుతున్నది. దేశంలోని మిగిలిన రాష్ర్టాల వలే తెలంగాణకు కూడా కేంద్రం చేయూతనిస్తే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మరింత తేజోమానంగా వెలిగిపోయేది.