హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): గృహజ్యోతి పథకం పేరు గొప్ప.. ఊరు దిబ్బలా కనబడుతున్నది. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించుకున్నది. కానీ.. మార్గదర్శకాలకు వచ్చేసరికి పేదలెవరూ ఈ పథకం కిందికి రాకుండా అడ్డుకట్ట వేసినట్టుగా కనబడుతున్నది. సొంత ఇల్లు లేనివారు, కిరాయి ఇంట్లో ఉంటున్నవారు రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉంటారు.
ఇప్పుడు వీరందరూ ‘జీరో బిల్లు’కు అనర్హులని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. తెల్లరేషన్ కార్డు ఉన్న ఒక కుటుంబానికి ఎన్ని విద్యుత్తు కనెక్షన్లు ఉన్నా.. అందులో ఒక్క కనెక్షన్కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నది. విద్యుత్తు శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే వినియోగదారుల సంఖ్య 1.05 కోట్లు. ఇందులో కనీసం పావుశాతం మందికి కూడా జీరో బిల్లు వస్తుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.