Congress | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): నాలుగు నెలల్లోనే కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయా? లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తేడా కొడుతున్నదా? ప్రత్యర్థులపై ఎప్పుడూ ఎదురుదాడి చేసే రేవంత్రెడ్డి.. ఎందుకు సడన్గా ఎమోషనల్ మాటలు మాట్లాడారు? పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పసిగట్టారా? కుట్రలు చేస్తున్నరు, దొంగ దెబ్బ తీయాలనుకుంటున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? పార్లమెంట్ ఎన్నికలు తమ పాలనకు కచ్చితంగా రెఫరెండమే అని ప్రకటించిన ఆయన ఇప్పుడెందుకు సానుభూతి రాగం ఎత్తుకున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ ఇదే.
సోమవారం సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రేవంత్రెడ్డి పరపతిని తగ్గించాలంటే కొడంగల్లో మెజార్టీ తగ్గించాలి. లేదంటే రేవంత్రెడ్డిని దొంగ దెబ్బ తీయాలి. అందుకే వెనకాల గూడుపుఠాని చేస్తున్నరు. ఇది రేవంత్రెడ్డిని దెబ్బతీయటం కాదు.. కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం.
ఏదైనా తప్పిదం జరిగితే కొడంగల్కు వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ, రైల్వేలైన్, నారాయణపేట ఎత్తిపోతల ఆగిపోతది. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా రాకుండా పోతది. ఇన్ని నష్టాలు జరుగుతా యి. మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నయ్. మనల్ని దెబ్బతీయడానికి ప న్నాగాలు పన్నుతున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తనను దెబ్బతీసేందుకు వెనక కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పటం రాజకీయ వర్గా ల్లో చర్చకు దారితీసింది. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? కారణమేంటి? దేనికి సంకేతం? అంటూ ఆరా తీస్తున్నారు.
వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకేనా?
రేవంత్రెడ్డి అంటేనే మాటల తూటాలు. ఏ పరిస్థితుల్లో అయినా సరే ప్రత్యర్థులపై తన మాటలతో ఎదురుదాడి చేస్తూ విరుచుకుపడుతారు. అది ఆయన సహజశీలి. కానీ కొడంగల్ సమావేశంలో మాత్రం తన శైలికి భిన్నంగా బేలగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్య క్తం అవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఇలాంటి సానుభూతి వ్యాఖ్యలు చేయలేదని చర్చ జరుగుతున్నది. సీఎంగా ఉంటూ తనపై కుట్రలు చేస్తున్నారని, దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమోషనల్ మాటలు మాట్లాడటంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
ఓ హీరో తిక్కకు లెక్క ఉన్నట్టే.. రేవంత్రెడ్డి సానుభూతి వ్యాఖ్యలకూ ఓ లెక్క ఉన్నదని అంటున్నారు. తీవ్రమైన సాగు నీటి కొరతతో రాష్ట్రవ్యాప్తంగా చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా తాగునీటి కటకట మొదలైంది. మరో 15 రోజుల్లో గుక్కెడు నీళ్లు కూడా దొరికే పరిస్థితి ఉండదనే అంచనాలున్నాయి. దీంతో కాంగ్రెస్ 4 నెలల పాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదనే ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ గట్టెక్కాలన్నా, తన పరపతి నిలవాలన్నా సానుభూతి రాగమే ఏకైక అస్త్రమని రేవంత్ భావిస్తున్నట్టు తెలిసింది.
మొన్న రెఫరెండం.. ఇప్పుడేమో కుట్ర రాగం
నెల రోజుల కిందటి వరకు లోక్సభ ఎన్నికలపై సీఎం రేవంత్రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనిపించారు. ఎక్కడ సమావేశం జరిగినా ‘ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా మా ప్రభుత్వ 100 రోజుల పాలనకు రెఫరెండంగా పరిగణిస్తాం’ అని గొప్పగా చెప్పారు. తీరా పదిహేను రోజులు గడిచేసరికి ఆయనలో అప్పటి కాన్ఫిడెన్స్ కనిపించటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే రెఫరెండం మాటను మార్చి, సానుభూతి రాగం ఎత్తుకున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ మధ్య సమావేశాల్లో ఆయనెక్కడా రెఫరెండం వ్యాఖ్యలు చేయకపోవటం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది.
కాంగ్రెస్ నేతల్లో ఓటమి భయం!
అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి తారుమారైందనే అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఆ పార్టీ నేతలు గమనించినట్టే ఉన్నారు. అందుకే ముందుజాగ్రత్త పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసినంతగా లోక్సభ ఎన్నికలకు పనిచేసేందుకు సిద్ధంగా లేరు. పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కూడా అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
ఎత్తుగడలు, కుట్రలు అవుతాయా?
రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులు సహజం. ఇవి ఎవరైనా చేసేవే. ఒక పార్టీ చేసే ఎత్తుగడలు, వ్యూహాలను కుట్రలు అని అనుకోవచ్చా? రేవంత్ ఎలాంటి ఎత్తుగడలు, వ్యూహాలు లేకుండానే ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక, రేవంత్రెడ్డి తన సానుభూతిరాగాన్ని తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే మొదలుపెట్టారు. తన సొంత నియోజకవర్గంలోనే అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతున్నది. అంటే కాంగ్రెస్కు, రేవంత్రెడ్డికి ఆయన సొంత నియోజకవర్గంలోనే ఎదురుగాలి వీస్తున్నదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నా యి. కాంగ్రెస్ గెలకపోయినంత మాత్రాన అభివృద్ధి పనులు ఆగిపోతాయని సీఎం ఏ విధంగా చెప్తారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
టార్గెట్ బీఆర్ఎస్.. పాలన గాలికి
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి బీఆర్ఎస్పై ప్రతికార రాజకీయాలకు తెరతీశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ను బదనాం చేయాలన్న కుతూహలంలో పాలనను పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో రైతులను బలిపెట్టి బీఆర్ఎస్ను దెబ్బతీయాలని ప్రయత్నించారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మళ్లీ ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తగ్గించి.. ఇంటికి రప్పించుకున్నారు
‘నా పుట్టలో వేలు పెడితే కుట్టకుండా ఊరుకుంటానా?’ అనే సామెత కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ తమ బెట్టు చూపించి సీఎం రేవంత్రెడ్డిని తమ ఇంటికి రప్పించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డే స్వయంగా వాళ్ల ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ను కాదని తన సొంతమనిషి చామల కిరణ్కుమార్రెడ్డికి రేవంత్ టికెట్ ఇప్పించుకున్నారు. అక్కడ ఆయన గెలవాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు తప్పనిసరి. దీంతో రేవంత్రెడ్డి తానంతటతానే తగ్గి బుధవారం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇంటికి వెళ్లి కిరణ్ను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.
ఓటమి భయంతోనే రేవంత్రెడ్డి తప్పుకున్నారా?
లోక్సభ ఎన్నికల కోసం నియోజకవర్గాలవారీగా పార్టీ అధిష్ఠానం పలువురు నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఇంచార్జిగా ఉన్నారు. అయితే తాజాగా ఇంచార్జి బాధ్యతల నుంచి రేవంత్ తప్పుకున్నారు. ఆయన ఇంచార్జిగా తప్పుకోవటంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఇన్చార్జిగా ఉన్న రెండింటిలో ఒకటి మల్కాజ్గిరి. అది ఆయన సిట్టింగ్ ఎంపీ స్థానం. మరోటి ఆయన సొంత నియోజకవర్గం.
ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ స్థానాల్లో పార్టీ ఓడిపోతే తన ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే తప్పుకున్నారన్న అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి పరపతిని ఎవరు తగ్గించగలుగుతారు? కానీ, రేవంత్ వ్యాఖ్యల వెనుక మర్మం ఏదో ఉన్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలోనే ఒకరిపై మరొకరికి నమ్మకమే లేదనే ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య పైకి కనిపించినంత సఖ్యత లేదనే చర్చ జరుగుతున్నది.