గ్రూప్-1 మెయిన్స్కు లైన్ క్లియర్ అయ్యింది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. సమాంతర రిజర్వేషన్ల విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు సూచించడంతో ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ అక్టోబర్ 9న నిర్వహించింది. అదే నెలలో పికప్ లిస్ట్ ఇస్తామని తెలిపింది. గ్రూప్ -1 పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లు 33.33 శాతానికి పరిమితం చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి గురువారం హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. గ్రూప్ -1 నియామకాల్లో రాజేశ్కుమార్ వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అమలు చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. దీంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ అధికారులు శుక్రవారం భేటీ అయ్యారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు, మెయిన్స్ పరీక్ష తదితర అంశాలపై చర్చించారు. పదిరోజుల్లో ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయనున్నట్టు కమిషన్ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి తెలిపారు.
మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు!
గ్రూప్ 1 మెయిన్స్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుందని టీఎస్పీఎస్సీ తొలుత ప్రకటించింది. కానీ.. కోర్టు కేసుల కారణంగా ప్రిలిమినరీ ఫలితాల విడుదల ఆలస్యమైంది. దీంతో పరీక్షల తేదీపై అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొన్నది. కాగా, ఏప్రిల్లో గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్-2, సీడీపీవో, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలకు పరీక్షలు జరుగనున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొన్న టీఎస్పీఎస్సీ ఏప్రిల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నది. అందుకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నది.
మెయిన్స్కు 25,150 మంది…
తెలంగాణలో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్కు భారీ పోటీ నెలకొన్నది. అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 2,86,051 మంది హాజరయ్యారు. అందులో బబ్లింగ్, ఇతర నిబంధనలు పాటించని 135 మందిని పక్కనపెట్టి.. మిగిలిన 2,85,916 మంది అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ను టీఎస్పీఎస్సీ ఇప్పటికే పూర్తిచేసింది. పరీక్ష తుది ‘కీ’ ని కూడా ప్రకటించింది. మొత్తం 503 పోస్టులు ఉండగా.. ఒక్కో ఉద్యోగానికి 50 మంది చొప్పున మెయిన్స్కు ఎంపిక చేస్తారు. అంటే.. మొత్తం 25,150 మంది మెయిన్స్ పరీక్షకు ఎంపిక అవుతారు.