Kaleshwaram | జగిత్యాల, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం జలాలు నలు దిశలా పారేలా నిర్మించిన కాలువలు జీవనదిని తలపిస్తున్నాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులు పూర్తి కాగా, వరదకాలువ మూడు రిజర్వాయర్లుగా మారింది. వరదకాలువ నుంచి ఎస్సారెస్పీ ప్రధాన కాలువలోకి లింక్ ఏర్పాటు చేసి, కాళేశ్వరం జలాలను కాకతీయ ప్రధాన కాలువలోకి పంపిస్తే, ఎస్సారెస్పీపై పూర్తి భారం తగ్గిపోతుందని, దీనివల్ల చొప్పదండి, ధర్మపురి, కరీంనగర్, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని పలు మండలాల రైతుల భూములకు కాకతీయ డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీరందించవచ్చని అధికారులు నివేదికలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను నాలుగున్నరేండ్ల క్రితమే మంత్రి కొప్పుల ఈశ్వర్.. అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావును ఒప్పించి వరద కాలువ నుంచి కాకతీయ ప్రధాన కాలువకు లింక్ కెనాల్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించుకోగా నిర్మాణం ఇటీవలే పూర్తయింది.
లింక్ కెనాల్ను రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించారు. వరద కాలువ 88.400 కిలోమీటర్ వద్ద లింక్ కెనాల్ను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల పొడవున కాలువను నిర్మించారు. కాకతీయ ప్రధాన కాలువ 97.460 కిలోమీటర్ వద్ద లింక్ కెనాల్ను కలుపాలని ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో రామడుగు మండలం ర్యాలపల్లి పరిధిలో వరద కాలువకు రెండు గేట్లను (స్లూయిజ్) ఏర్పాటు చేశారు. స్లూయిజ్ల ద్వారా బయటికి వచ్చిన నీటిని కాలువ ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలో మల్యాల మండలం తాటిపల్లి శివారులో ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ 97.460 కిలోమీటర్ వద్ద లింక్ చేశారు. ఈ లింక్ కోసం కాకతీయ ప్రధాన కాలువకు రెండు స్లూయిజ్లను ఏర్పాటు చేశారు. వరద కాలువ నుంచి నీటిని లింక్ కెనాల్లోకి మళ్లించి, తాటిపల్లి వద్ద కాకతీయ కాలువలోకి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. 3,006 క్యూసెక్కుల సామర్థ్యంతో, మూడు కిలోమీటర్ల పొడవున లింక్ కెనాల్ను నిర్మించారు.
గతంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడే కాకతీయ కాలువల ద్వారా పారి డిస్ట్రిబ్యూటరీల పరిధిలోని రైతుల పంటలకు అందేది. ఇప్పుడు ఎస్సారెస్పీలో నీళ్లు లేకపోయినా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఏర్పడింది. వరద కాలువను ఆసరాగా చేసుకొని, లింక్ కెనాల్ నుంచి కాకతీయ కాలువలోకి నీటిని మళ్లించి, డిస్ట్రిబ్యూటరీల పరిధిలోని రైతుల భూముల్లోకి నీళ్లు మళ్లించడానికి మార్గం సుగమమైంది. ఈ లింక్ కెనాల్ ద్వారా డీ-70 నుంచి డీ-94 నంబర్ వరకు ఉన్న డిస్ట్రిబ్యూటరీ రైతులకు మేలు జరగనున్నది. ఒక ధర్మపురి నియోజకవర్గ పరిధిలోనే 7 వేల ఎకరాల ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. ధర్మపురితోపాటు చొప్పదండి, కరీంనగర్, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని పలు డిస్ట్రిబ్యూటరీల రైతులకు సైతం దీనివల్ల ప్రయోజనం చేకూరనున్నది. నాలుగున్నరేండ్ల క్రితం మొదలైన ఈ లింక్ కెనాల్ పనులు ఇటీవలే పూర్తి కాగా, ఈ కెనాల్ ద్వారా వారం రోజుల క్రితం నీటిని కాకతీయ కాలువలోకి విడుదల చేశారు.
మల్యాల మండలం తాటిపల్లి సమీపంలో వరద కాలువ నుంచి ఎస్సారెస్పీ కాలువకు లింక్ కెనాల్ ఏర్పాటు చేసిన్రు. నీళ్లు కూడా వదులుతున్నరు. ఇక రెండు పంటలకు నీళ్లందుతయ్. ఇదివరకు వర్షాధారంగా వరి, యాసంగిలో కాలువ నీటితో ఆరు తడి పంటలు ఏసెటోళ్లం. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వరద కాలువకు నీళ్లు రావడం, అదే వరద కాలువ నుంచి లింక్ కెనాల్ ద్వారా ఎస్సారెస్పీ కాలువకు నీళ్లు ఇవ్వడం వల్ల సాగునీటి ఇబ్బందులు పోతున్నయ్. ఇక రెండు పంటలకూ ఇబ్బందులుండవు. సీఎం కేసీఆర్ రైతులకు చేస్తున్న మేలును మేం మరిచిపోం.
– ఒరుగల రాజేశం, రైతు, మం: పెగడపల్లి
పెగడపల్లి మండలంలోని ఆయకట్టేతర ప్రాంతమైన ఐతుపల్లి గ్రామానికి వరద కాలువ వల్ల తాగు, సాగు నీటి ఇబ్బందులు తొలిగిపోతయ్. కొత్తగా తాటిపల్లి శివారులోని వరద కాలువ నుంచి ఎస్సారెస్పీ కాలువకు లింక్ కెనాల్ తవ్వి, నీళ్లు ఇస్తుండటం వల్ల బావుల్లో భూగర్భ జలాలు బాగా పెరుగుతయ్. దీనివల్ల పంటలకు నీళ్ల బాధ తొలగిపోతుంది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మించడంతో రైతులకు నీళ్ల గోస తీరింది.
– పీ అంజయ్య, రైతు, గ్రా:ఐతుపల్లి, మం: పెగడపల్లి