Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన రూట్ మ్యాప్ను ప్రభుత్వం ఖరారు చేసింది. నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు రూట్ల విస్తరణ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గం (31 కి.మీ)ను నిలిపివేసి, దానికి బదులుగా రాయదుర్గం నుంచి నానక్రాంగూడ మీదుగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు 8 కి.మీ మార్గంలో మెట్రోను నిర్మించాలని ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతోపాటు ఇతర మార్గాలకు సంబంధించిన తుది రూట్ మ్యాప్ను సీఎం ఆదేశాలతో హైదరాబాద్ మెట్రో అధికారులు సిద్ధం చేశారు.
ఏయే ప్రాంతాల నుంచి ఏయే మార్గాల్లో మెట్రో విస్తరించనున్నదో తెలియజేసేలా మ్యాప్ను తయారుచేసి సోమవారం విడుదల చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉన్నది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గ్ వరకు మెట్రో కనెక్టివిటీ ఉన్నది. రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న కారిడార్-2ను చాంద్రాయణగుట్ట క్రాస్రోడ్డు వరకు పొడిగిస్తారు. దీనికి తోడు కొత్తగా మరో నాలుగు కారిడార్లలో మెట్రోరైలు రూట్ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తంగా రెండో దశలో 70 కి.మీ దూరంతో కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేలా ఈ ప్రతిపాదనలను మెట్రో అధికారులు రూపొందించారు. కాగా ఇప్పటికే మొదటి దశలో ఉన్న కారిడార్-2(జేబీఎస్-ఫలక్నుమా)ను అదే పేరుతో చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇక మిగతా కారిడార్లకు కారిడార్-4 నుంచి కారిడార్-7 వరకు వాటి మార్గాలను నిర్దేశించారు.
శరవేగంగా డీపీఆర్ల తయారీ: ఎన్వీఎస్ రెడ్డి
కొత్తగా ఖరారు చేసిన 70 కి.మీ మెట్రో మార్గానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు-డీపీఆర్)ను శరవేగంగా రూపొందించేందుకు చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మరో 3 నెలల్లోనే డీపీఆర్లను సిద్ధం చేస్తామని చెప్పారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని విస్తరించడం ద్వారా భారీ సంఖ్యలో పేద, మధ్యతరగతి వర్గాలకు మెట్రో రైలు సేవలను అందించాలనే ప్రభుత్వం లక్ష్యం నేరవేరుతుందని చెప్పారు.
66 కి.మీ అత్యంత పొడవైన కారిడార్గా.
మొదటి దశలోని కారిడార్-3 (నాగోల్ -రాయదుర్గం) 29 కి.మీ ఉండగా, రెండో దశలో నిర్మించే మెట్రో మార్గాలతో కలిపి మొత్తం 66 కి.మీ పొడవుతో నగరంలోనే అత్యంత పొడవైన మెట్రో మార్గంగా మారనున్నది. ఇందులో నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు లోపలి వరకు 29 కి.మీ, అదేవిధంగా రాయదుర్గం నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు 8 కి.మీ కలిపి మొత్తం 66 కి.మీ మెట్రో మార్గం అనుసంధానం కానున్నది. ఆ తర్వాత మొదటి దశలో కారిడార్-1 (మియాపూర్-ఎల్బీనగర్ 29 కి.మీ) రెండు వైపులా ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు 8 కి.మీ, మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరువు వరకు మరో 14 కి.మీ కలిపి మొత్తం 51 కి.మీ పొడవుతో నిర్మాణం కానున్నది.
రెండో దశలో చేపట్టే మెట్రో కారిడార్లు( కొత్త రూట్ మ్యాప్)