పచ్చదనాన్ని పెంచే రాష్ర్టాలకు అధిక కంపా నిధులివ్వాలి
ప్రదర్శన క్షేత్రాలతో అటవీ అధికారులకు శిక్షణ ఇవ్వాలి
అభివృద్ధి పనుల అనుమతులను సరళీకరించాలి
కేంద్ర అటవీ శాఖకు మంత్రి కేటీఆర్ ప్రతిపాదనలు
మంత్రి ఇంద్రకరణ్తో కలిసి అటవీశాఖ జాతీయ వర్క్షాప్ ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : సులభతర వాణిజ్య విధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్ విధానాన్ని తీసుకొచ్చి రాష్ర్టాల మధ్య పోటీ పెంచాలని కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. నెట్ జీరో లక్ష్య సాధన దిశగా రాష్ర్టాలను ప్రోత్సహించేలా ర్యాంకింగ్ విధానాన్ని తీసుకురావాలని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని గ్రాండ్ కాకతీయలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ, తెలంగాణ అటవీశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ‘అటవీశాఖ జాతీయ వర్క్షాప్’ను రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, పచ్చదనం పెంపులో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని, పచ్చదనం పెంపు విషయంలో బాగా పనిచేస్తున్న రాష్ర్టాలకు కంపా నిధులు అధికంగా ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఫలితంగా పచ్చదనం 24 శాతం నుంచి 31.7 శాతానికి పెరిగిందని వెల్లడించారు. నగరాల్లో భవనాలు కూలగొట్టి చెట్లు నాటే పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన మొదట్లో తమకు చెప్పారని గుర్తుచేశారు. పరిశ్రమలు, పట్టణాభివృద్ధితో పాటు పచ్చదనం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని స్పష్టం చేశారు. తెలంగాణ, హైదరాబాద్.. ఈవోడీబీ ర్యాంకులతో పాటు పచ్చదనం పెంపులోనూ అగ్రగామిగా ఉన్నాయని పేర్కొన్నారు. చెట్ల మనుగడ రేటు, విసృ్తతమైన తోటల పెంపకంపై అటవీశాఖలోని యువ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోనే ఆరు రకాల నేలలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా మరిన్ని రకాలు ఉండవచ్చని చెప్పారు. సిబ్బందికి సమర్థ శిక్షణ ఇవ్వడానికి ప్రదర్శన క్షేత్రాలు సహాయపడుతాయని వెల్లడించారు.
అనుమతులపై సానుకూలంగా స్పందించాలి
పట్టణాల్లో వివిధ అభివృద్ధి పనులకు అనుమతుల విషయంలో అటవీశాఖ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సానుకూలంగా స్పందించాలని, సరళీకృత విధానాలు పాటించాలని కేటీఆర్ విన్నవించారు. 1987 నాటికి భారత్, చైనా జీడీపీ సమానంగానే ఉండేదని, కానీ ప్రస్తుతం చైనా జీడీపీ ఏ స్థాయికి ఎదిగింది, భారత్ ఎందుకు ఎదగలేకపోయిందో ఆలోచించాల్సి ఉన్నదని చెప్పారు.
హరితనిధితో పెరగనున్న పచ్చదనం: ఇంద్రకరణ్
పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘హరిత నిధి’ని ఏర్పాటు చేశారని, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేశారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. హరితనిధి ద్వారా వచ్చే నిధులను అడవుల పెంపకం, అటవీ పునరుజ్జీవం కోసం వినియోగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అటవీ ప్రాంతం వెలుపల 130 కోట్లు, అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొకలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నదని చెప్పారు. జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదంతో రిజర్వ్ ఫారెస్ట్లో పెద్దఎత్తున మొకలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించారు. 2021 నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం, పచ్చదనం, అటవీ ప్రాంతంలో కార్బన్ నిల్వల పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని తెలిపారు. నగర, పట్టణవాసుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. ఇప్పటికే 53 పారుల అభివృద్ధి పూర్తి చేశామని పేర్కొన్నారు.
ఇతర రాష్ర్టాలు తెలంగాణ విధానాలను అనుసరించాలి: కేంద్ర అటవీశాఖ
గ్రీన్ ర్యాంకులు ప్రకటించాలన్న మంత్రి కేటీఆర్ ప్రతిపాదనపై కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ చంద్ర ప్రకాశ్ గోయల్ స్పందించారు. పచ్చదనం పెంపు కోసం తెలంగాణ సర్కారు హరితహారం సహా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అవన్నీ మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ఇతర రాష్ర్టాలు కూడా తెలంగాణ విధానాలను అనుసరించాలని సూచించారు. గ్రీన్ ర్యాంకుల విషయంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, కేంద్ర అటవీశాఖ అదనపు డీజీ, జాతీయ కంపా సీఈవో సుభాష్ చంద్ర, రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.