రంగారెడ్డి : మొక్కల యజ్ఞం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సాధువులు, గురువుల వరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ప్రముఖ యోగ గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకుడు శ్రీ.శ్రీ. రవి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా శంకర్పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఉసిరి మొక్కనను నాటారు.
ఈ సందర్భంగా చెట్ల ఔన్నత్యాన్ని చాటేలా..భారతీయ సంస్కృతిలో చెట్ల ప్రాముఖ్యతను తెలిపేలా ముద్రించిన ‘వృక్షవేదం’ పుస్తకం గురించి గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి రాఘవ రవిశంకర్కి వివరించారు. అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ..రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం మహోన్నతమైందన్నారు.
భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని కాపాడాలనే వారి ఆలోచన అద్భుతమైందని ప్రశంసించారు. చెట్లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి పండ్లను ఇస్తూ.. జీవుల ఆకలి తీర్చేవి. రెండు ఏపుగా పెరిగి జీవులకు నీడనిచ్చేవి. ఇవి రెండు మానవళికి ఉపయోగకరమైనవేనని ఆయన తెలిపారు.
అయితే జీవుల అవసరాలను గుర్తిస్తూ.. అందుకు అనుగుణంగా మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అది గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు చేస్తున్న తీరు నన్నెంతో ఆకట్టుకుందన్నారు. కార్యక్రమంలో బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, మల్లికార్జున్ రెడ్డి, ఆశ్రమ బాధ్యులు, ఇతర భక్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసం
Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం