హైదరాబాద్ : నగరంలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు విధ్వంసం సృష్టించారు. మేయర్ ఛాంబర్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఎన్నికల కోడ్ ఉన్నందున సమావేశం నిర్వహించలేమని అధికారులు బీజేపీ నేతలకు సూచించారు.
అధికారులు చెప్పినా పట్టించుకోకుండా.. కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సిందేనని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే మేయర్ ఛాంబర్లోకి బీజేపీ కార్పొరేటర్లు చొచ్చుకెళ్లి.. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.