హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల నియంత్రణపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు చేపట్టిన సైబర్ వారియర్స్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకు చేరుకొన్నది. కాంటినెంటల్ కాఫీ, భరోసా సొసైటీ సహకారంతో పోలీస్, వైద్యశాఖలు సంయుక్తంగా ఏడాదిపాటు రాష్ట్రవ్యాప్తంగా 1,650 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించాయి. ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు చొప్పున 3,300 మంది విద్యార్థులను ఎంపిక చేసి సైబర్ నేరాల నియంత్రణపై శిక్షణ ఇచ్చాయి. ఈ శిక్షణ ఏప్రిల్లో ముగిసింది. ఇప్పుడు వారి ప్రతిభను పరీక్షించేందుకు సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను గురువారం రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఇన్చార్జీ, అడిషనల్ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి విడుదల చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం నుంచి వారంపాటు పలు అంశాలపై ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫిల్మ్మేకింగ్, మీమ్స్, పాటల రచన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఒక్కో జిల్లా నుంచి ముగ్గురు విజేతలను ఎంపికచేసి ఆగస్టు 4న గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నట్టు తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళా భద్రత విభాగం ఎస్పీ రఘువీర్, డీఎస్పీ రాంకుమార్, యంగిస్థాన్ ఫౌండేషన్ డైరెక్టర్ అరుణ్ డేనియల్ తదితరులు పాల్గొన్నారు.