హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ ప్రభావం రైతన్నపై, వ్యవసాయ రంగంపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లపై ఎటువంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. లాక్డౌన్లో ధాన్యం రవాణా, రైస్ మిల్లులు, గోడౌన్ల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 6,502 కేంద్రాలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం రూ. 5,508 కోట్లతో 29.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. వాస్తవానికి ఈ సీజన్లో ధాన్యం దిగుబడి భారీగా ఉన్నది. దీంతో 80 లక్షల వరకు ధాన్యం కొనుగోళ్లు జరుగవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు, కరోనా సమస్యలతో ధాన్యం కొనుగోళ్లకు అక్కడక్కడ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా రైతుకు తీరని నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లకు మినహాయింపునిచ్చారు. పౌరసరఫరాల సంస్థ అధికారులు, జిల్లా, మండల స్థాయి అధికారులు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకున్నారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలు, సన్నద్ధతను పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ క్యాబినెట్కు వివరించారు. కరోనా సమయంలోనే సమస్యలను పరిష్కరించుకుంటూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. రైతులను ఇబ్బందుల నుంచి గట్టేక్కించేలా ధాన్యం కొనుగోళ్లకు, వ్యవసాయ రంగానికి లాన్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వడంపై సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.