మీపై 1.16 లక్షల రూపాయల అప్పు ఉంది. ఆశ్చర్యపోయినా.. ఇది నిజం. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ.152.6 లక్షల కోట్ల అప్పులు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.15.4 లక్షల కోట్ల రుణాల సమీకరణకు యోచిస్తున్నది. అంటే, దేశ జనాభా 140 కోట్లుగా అనుకొంటే, సెకనుకు ముందు పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిపై రమారమి లక్ష రూపాయలకు పైగా అప్పు ఉన్నట్టు లెక్క.
మొత్తం బడ్జెట్: రూ.45.03 లక్షల కోట్లు
కొత్తగా చేయనున్న అప్పులు: రూ.15.5 లక్షల కోట్లు
బడ్జెట్లో మొత్తం రుణాల వాటా: 34.42 శాతం
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24) మరిన్ని అప్పులు చేయాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే డేటెడ్ సెక్యూరిటీల నుంచి రికార్డు స్థాయిలో రూ.15.4 లక్షల కోట్ల రుణాల సమీకరణకు యోచిస్తున్నది. ఈ మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే రూ.1.19 లక్షల కోట్ల అప్పులు పెరుగుతుండటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.14.21 లక్షల కోట్ల అప్పుల్ని తీసుకుంటామని గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అంకెల గారడితో ప్రకటించిన ఈ బడ్జెట్.. భారీ ద్రవ్యలోటుకు దారితీస్తున్నది. దాన్ని పూడ్చేందుకే అదనంగా మరో రూ.1.2 లక్షల కోట్ల అప్పుల్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ సంకేతాలనే ఇచ్చారు. కాగా, కొత్తగా సమీకరించే రూ.15.4 లక్షల కోట్ల రుణాల్లో డేటెడ్ సెక్యూరిటీల నుంచి రూ.11.8 లక్షల కోట్లుంటాయని అంచనా. అలాగే చిన్న మొత్తాల పొదుపు, ఇతర మార్గాల నుంచి మరో రూ.3.6 లక్షల కోట్ల నిధులను సేకరించాలని మోదీ సర్కారు ఈ బడ్జెట్లో లెక్కలు వేసింది. మొత్తానికి దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులతో తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ బడ్జెట్ కేటాయింపుల అమలు పెద్ద సవాల్గానే మారనున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అప్పుల వడ్డీ భారం ఇంకెంత? ఉంటుందోనన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను లక్ష్యంగా పెట్టుకున్న రూ.14.21 లక్షల కోట్ల అప్పుల్లో రూ.12.93 లక్షల కోట్ల రుణాల సమీకరణ ఇప్పటికే జరిగిపోయింది. జనవరి 27 నాటికి రుణ సేకరణ లక్ష్యం 91 శాతం పూర్తయ్యిందంటూ బడ్జెట్లో తెలిపారు. 2022-23లో మార్కెట్ నుంచి ప్రభుత్వ నికర రుణ సమీకరణ రూ.11.6 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం (2021-22)తో చూస్తే రూ.2 లక్షల కోట్లు పెరగడం గమనార్హం. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం సబ్సిడీలు పెరిగినా ద్రవ్యలోటును 6.4 శాతానికి కట్టడి చేస్తామన్న ఆర్థిక మంత్రి.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5.9 శాతాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు.
గత 67 ఏండ్లలో కేంద్రం చేసిన అప్పు రూ.55,87,147 కోట్లు కాగా, మోదీ ప్రధాని అయిన తర్వాత ఎనిమిదిన్నరేండ్లలో చేసిన అప్పు రూ.106 లక్షల కోట్లకు పైగా ఉన్నది. అప్పటి ప్రధానులు ఏడాదికి సగటున రూ.83 వేల కోట్ల అప్పులు చేస్తే, మోదీ ఏకంగా నెలకే దాదాపు రూ.1.03 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరోవైపు చేసిన అప్పులకు గానూ కేంద్రం పెద్దయెత్తున వడ్డీలు చెల్లిస్తున్నది. 2014-15లో తీసుకొన్న రుణాలకు రూ.4.02 లక్షల కోట్లను వడ్డీగా చెల్లించగా, 2021-22లో రూ.8.14 లక్షల కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం రూ.9.4 లక్షల కోట్లను, వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.10.8 లక్షల కోట్లను వడ్డీగా చెల్లించనున్నట్టు సమాచారం. ఈ లెక్కన ప్రతినెల రూ.90 వేల కోట్ల చొప్పున కేంద్రం వడ్డీల రూపంలో చెల్లించనున్నది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ, దొడ్డిదారిన పన్నులు వసూలు చేస్తూ బీజేపీ ప్రభుత్వం సామాన్యుల ఉసురు తీస్తున్నది.